
న్యూఢిల్లీ: తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలపై భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ స్పందించాడు. ఇప్పట్లో ఆటకు వీడ్కోలు పలికే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. దేశం కోసం ఆడాలన్న అంకితభావం, తపన ఇంకా తనలో చాలా ఉన్నాయని బుధవారం ఆన్లైన్ చర్చలో 36 ఏళ్ల ఛెత్రీ అన్నాడు. ప్రస్తుతం తన ఆటను ఆస్వాదిస్తున్నానని, ఆటను ఆస్వాదించలేని రోజు వీడ్కోలు పలుకుతా అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఖతార్ పర్యటనలో భారత ఫుట్బాల్ జట్టు ఉండగా.. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఛెత్రీ రెండు గోల్స్తో జట్టును గెలిపించాడు.
'రిటైర్మెంట్ గురించి ఆలోచించట్లేదు. నా ఆటను ఆస్వాదిస్తున్నా. మునుపెన్నడూ లేనంత ఫిట్గా ఉన్నా. నాకు 36 ఏళ్లు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న ఉత్సాహం, ఆకలి అలానే ఉన్నాయి. నా ఆటను ఆస్వాదించలేని రోజు వీడ్కోలు పలుకుతా. ఫుట్బాల్లో కొనసాగను. ప్రేరణ ఒక్కటే కష్టమైన అంశం. వయసు పెరిగేకొద్దీ.. ఘనతలు సాధించేకొద్దీ ప్రేరణ తగ్గుతుంది. దేశం తరఫున 74 గోల్స్ సాధించడం గర్వంగా ఉంది. నేనాడే చివరి మ్యాచ్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తా. మెస్సితో సహా ఏ ఆటగాడితోనూ పోలిక అవసరం లేదు. నా కంటే మెరుగైన ఆటగాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. ఫుట్బాల్ను అర్థంచేసుకున్న వాళ్లకు ఈ విషయం తెలుస్తుంది' అని సునీల్ ఛెత్రీ అన్నాడు.
ఫిఫా ప్రపంచకప్ (2022), 2023 ఆసియాకప్ సంయుక్త క్వాలిఫయర్స్లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో డబుల్ గోల్స్తో భారత జట్టును గెలిపించిన గోల్స్ మెషీన్ సునీల్ ఛెత్రీ.. అంతర్జాతీయ గోల్స్లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని అధిగమించాడు. ప్రస్తుతం ఆడుతున్న వారిలో 103 ఇంటర్నేషనల్ గోల్స్తో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా.. మెస్సీ (72)ని దాటేసి ఛెత్రీ (74) రెండో స్థానానికి చేరుకున్నాడు.
తాను చేసిన గోల్స్ ఎప్పుడూ లెక్కించుకోనని భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ చెప్పాడు. జట్టుగా తామెప్పుడూ విజయం సాధించేందుకే శ్రమిస్తామని అన్నాడు. 74 గోల్స్ చేసిన ఛెత్రీపై భారత హెడ్కోచ్ ఇగోర్ స్టిమాక్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు 25 ఏళ్ల యువ ఆటగాడిలా ఎంతో ఉత్సాహం, సామర్థ్యంతో ఆడుతున్నాడని అన్నాడు. అత్యుత్తమాన్ని మించి రాణిస్తున్నాడని పొగిడాడు. మరోవైపు భారత మాజీ కెప్టెన్ బైచింగ్ భూటియాతో పాటు పలువురు ఆటగాళ్లు ఛెత్రీని ప్రశంసించారు.