
హైదరాబాద్: తనపై చూపెడుతున్న వివక్ష కారణంగా జర్మన్ ఫుట్బాల్ ఫెడరేషన్ తరపున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడబోనని ఆ జట్టు స్టార్ ప్లేయర్ మెసట్ ఒజిల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. జర్మన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, కోచ్ల వేధింపుల కారణంగా ఫుట్బాల్ జట్టు నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటన చేశాడు.
గెలిపించినప్పుడు మాత్రమే జర్మన్గా గుర్తించడం. జట్టు ఓటమి పాలైన సందర్భాల్లో ఒక వలసదారుడి వల్లే ఇదంతా జరిగిందంటూ నిందించడం సరికాదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా, ఒజిల్ వ్యాఖ్యలకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మద్దతుగా నిలిచారు.
"ఒక క్రీడాకారిణిగా, ముఖ్యంగా మనిషిగా ఇలాంటి వార్తలు వినాల్సి రావడం చాలా బాధ కలిగిస్తోంది. ఒజిల్ నువ్వు చెప్పింది ఒకటి నిజం. జాత్యహంకారం అసలు ఉండకూడదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. ఒకవేళ ఇదంతా నిజమైతే చాలా దురదృష్టకరం" అని సానియా ట్విటర్లో పేర్కొన్నారు.
త్వరలో తల్లి కాబోతున్న సానియా మిర్జా ప్రస్తుతం ఆట నుంచి విరామం తీసుకున్న సంగతి తెలిసిందే.
అసలేం జరిగిందంటే!
టర్కీ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒజిల్ కొందరు సహచర ఆటగాళ్లతో కలిసి రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ను కలిశాడు. ఇలా కలవడం పట్ల జర్మనీకి చెందినవాడు కాదంటూ.. టర్కీ దేశస్థుడంటూ విమర్శించడం మొదలుపెట్టారు. దీనిపై వివరణ ఇచ్చిన ఒజిల్.. కేవలం టర్కీ మూలాలు ఉన్న కారణంగానే తనను విమర్శిస్తున్నారంటూ ఆరోపించాడు.
"ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ రెండు నెలలుగా నాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. నా పూర్వీకులు టర్కీకి చెందినవారు. కానీ నేను పెరిగిందంతా జర్మనీలోనే. నా సహచరులతో కలిసి టర్కీ అధ్యక్షుడితో దిగిన ఫొటోలను సాకుగా చూపి నాపై జాతి వివక్షకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని భూతద్దంలో చూపించి జర్మన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, మా కోచ్ వివరణ ఇవ్వాల్సిందిగా నన్ను డిమాండ్ చేశారు. అయితే కేవలం ఒక ఆటగాడిని మాత్రమే అనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి" అని ఒజెల్ ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశాడు.
రష్యా వేదికగా ఇటీవలే ముగిసిన ఫిఫా వరల్డ్ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన జర్మనీ జట్టు తొలి మ్యాచ్లోనే మెక్సికో చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ నుంచి జట్టులోని సీనియర్ ఆటగాడు ఒజిల్ను తుది జట్టు నుంచి పక్కన పెట్టేసింది. ఈ ఘటనలకు తీవ్రంగా కుంగిపోయిన ఒజిల్ ఇక ఆడబోనంటూ జర్మనీ ఫుట్బాల్కు వీడ్కోలు చెప్తూ ట్వీట్ చేశాడు.