హైదరాబాద్: మొన్నటి దాకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చూసి ఆనందించిన భారత ప్రేక్షకులను ఫుట్బాల్ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సిద్ధమైంది. కరోనా వైరస్ విజృంభించాక దేశంలో నిర్వహిస్తున్న తొలి మేజర్ టోర్నీ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. కట్టుదిట్టమైన బయో బబుల్లో ప్రేక్షకులు లేకుండా గోవా వేదికగా ఈ సాకర్ సమరం కొద్ది నిమిషాల క్రితం ప్రారంభం అయింది. తొలి మ్యాచ్లో జీఎంసీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్, కేరళ బ్లాస్టర్స్ తలపడుతున్నాయి.
ఐఎస్ఎల్, ఐ-లీగ్ విజేతలు ఏటీకే, మోహన్ బగాన్ విలీనమయ్యాక జట్టు ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే. గత సీజన్లో 15 గోల్స్తో అదరగొట్టిన ఏటీకే స్టార్ ఆటగాడు, కెప్టెన్ రాయ్ కృష్ణ ఎంతో కష్టపడి చివరకు భారత్ చేరాడు. తన దేశమైన ఫిజీ నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ద్వారా ఐదు విమానాలు మారి.. దాదాపు 40 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి టోర్నీకి సిద్ధమయ్యాడు. చివరకు ఈరోజు తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. గత సీజన్ మాదిరిగానే రాయ్ కృష్ణ సత్తాచాటుతాడేమో చూడాలి.
క్వారంటైన్ నిబంధనలు ఉండటంతో టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు నెల రోజులు ముందుగానే గోవాకు చేరుకున్నారు. ఇక టైటిల్ కోసం పోటీ పడే జట్ల సంఖ్య ఈ సారి పెరిగింది. లీగ్లోకి కొత్తగా స్పోర్టింగ్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ వచ్చి చేరడంతో.. జట్ల సంఖ్య 11కు చేరింది. టైటిల్ ఫేవరెట్లుగా డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్, మాజీ చాంపియన్ బెంగళూరు ఎఫ్సీ కనిపిస్తున్నాయి. తమ తొలి సీజన్ (2019-20)లో అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన కనబరచని హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ).. ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.
యూఏఈలో బయో సెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ విజయవంతం కాగా.. ఐఎస్ఎల్ కోసం గోవాలోని మూడు వేదికల్లో నిర్వాహకులు అదే తరహా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దాదాపు 120 రోజులకు పైగా జరిగే ఏడో సీజన్లో 115 మ్యాచ్లు జరుగనున్నాయి. మార్చిలో ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీకి కరోనా ఆటంకం కలిగించగా.. ఎట్టకేలకు ఎనిమిది నెలల తర్వాత మొదలు అయింది.
మహ్మద్ సిరాజ్ తండ్రి కన్నుమూత.. అంత్యక్రియలకు దూరం!!