కోచి: ఐఎస్ఎల్ 3 ఎడిషన్ టైటిల్ పోరు కోసం ఆదివారం జరిగే మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుట్ బాల్ అభిమానులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టిక్కెట్ల విక్రయంపై ద్రుష్టి సారించారు. వెబ్ సైట్లు, సోషల్ మీడియా గ్రూపుల ద్వారా అధిక రేట్లకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఎల్ మ్యాచ్ వీక్షించేందుకు టిక్కెట్ ధర రూ.300 కాగా, సదరు వ్యక్తి రూ.3000లకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
కేరళలో ఫుట్బాల్ ఆటకు ఉన్న క్రేజీని సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నించాడని చెప్పారు. సదరు టిక్కెట్ విక్రేతల వాయిస్ లను స్థానిక టివి చానెళ్లు కూడా ప్రసారంచేశాయన్నారు. బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లు విక్రయిస్తున్న మలప్పురం జిల్లాకు చెందిన ముస్తాఫా అనే వ్యక్తిని కోచి నగర పోలీసులు అరెస్ట్ చేశారు.
కేరళ, కోల్ కతా జట్ల మధ్య రెండోసారి టైటిల్ పోరు జరుగనుండటంతో మ్యాచ్ టిక్కెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పలువురు ఫుట్బాల్ అభిమానులు మలబార్ ప్రాంతం నుంచి టిక్కెట్ల కొనుగోలుకు కోసం కోచికి వచ్చినా లభించక నిరాశతో వెనుదిరిగారు. అధిక రేట్లపై టిక్కెట్లు విక్రయిస్తున్న విషయమై ఐఎస్ఎల్ నిర్వాహకుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.
టైటిల్ సమ్మిట్కు ఐరానియన్ రిఫరీ
ఇటీవల రియో ఒలింపిక్స్లో ఫుట్ బాల్ విభాగంలో ఫైనల్స్ రిఫరీగా వ్యవహరించిన తొలి ఏషియన్, ఇరాన్ దేశీయుడు అలీరిజా ఫఘానీ ఆదివారం అట్లెటికో డి కోల్కతా, కేరళ బ్లాక్ బస్టర్స్ జట్ల మధ్య ఐఎస్ఎల్ టైటిల్ పోరుకు జరిగే ఫైనల్స్ మ్యాచ్లో రిఫరీగా వ్యవహరించనున్నాడు. 2008 నుంచి ఫిఫా రిఫరీగా పనిచేస్తున్న అలిరీజా 2015 క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్స్, 2015 ఆసియా కప్ ఫైనల్స్కు ఇన్చార్జిగా వ్యవహరించాడు.
అలిరిజాకు ఆయన టీం సభ్యులు సహచర ఇరానియన్లు రెజా సొఖాండన్, మహ్మద్ రెజా మాన్సౌరి అసిస్టెంట్లుగా వ్యవహరిస్తారు. 2016 ఒలింపిక్స్ ఫైనల్స్లోనూ వీరే సహాయకులుగా ఉన్నారు. ఉత్తమ క్రీడా స్ఫూర్తి ప్రదర్శిస్తూ ప్రపంచంలోనే అలిరీజా ఉత్తమ రిఫరీగా పేరు తెచ్చుకున్నాడు.
ఎటికెపై ఫైన్: బెలెంకోసోపై రెండు మ్యాచ్ల నిషేధం
కోల్కతా: అట్లెటికో డి కోల్కతా (ఎటికె) ఫ్రాంచైసీపై అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) క్రమశిక్షణా కమిటీ రూ.7 లక్షల జరిమానా విధించింది. గత మంగళవారం ముంబై సిటీతో ముంబై ఎరీనాలో జరిగిన రెండో సెమీ ఫైనల్స్ మ్యాచ్ తర్వాత రెండు వేర్వేరు ఘటనల్లో క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఎటికెపై ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. ఇక ముంబై ప్లేయర్ లియో కోస్టాను ఢీ కొట్టినందుకు ఎటికె స్ట్రయికర్ జువాన్ బెలెంకోసోపై రెండు మ్యాచ్ల నిషేధం విధించింది. ఒకవేళ బెలెంకోసో వచ్చే సీజన్లో ఎటికె తరఫున ప్రాతినిథ్యం వహిస్తే మాత్రం తొలి మ్యాచ్కు దూరం కానున్నాడు.
బెలెంకోసోపై రూ.3 లక్షల జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. పది రోజుల్లోగా నగదు డిపాజిట్ చేయాలని ఎఐఎఫ్ఎఫ్ ఆదేశించింది. ముంబై సిటీ ఎఫ్ సి జట్టుపై విధించే జరిమానాను ఎఐఎఫ్ఎఫ్ క్రమశిక్షణా కమిటీ సమీక్షిస్తుందని ఐఎస్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. లియో కోస్టాను బెలెంకోసం క్లిప్ చేసినప్పుడు ఇరు పక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఇరు వైపుల నుంచి పలువురు ప్లేయర్లు వాదనకు దిగడం కనిపించింది. దీనికి పరాకాష్టగా బెలెంకోసోపై థియాగో చున్హా కుంగ్ ఫూ కిక్ చేసేందుకు వెనుకాడలేదు. కానీ కోల్ కతా ప్లేయర్లు, ఇతర సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు.