హైదరాబాద్: ఇటీవలే రష్యా వేదికగా ముగిసిన 21వ ఫిఫా వరల్డ్ కప్లో సెమీస్, ఫైనల్ మ్యాచ్ల్లో వెన్ను నొప్పితోనే బరిలోకి దిగానని ఫ్రాన్స్ యువ ఆటగాడు కైలియాన్ ఎంబాపే వెల్లడించాడు. సెమీస్కు మూడు రోజుల ముందు వెన్నుపూస గాయమైందని, దీని గురించి ఎవరికీ తెలియన్వికుండా సెమీస్, ఫైనల్స్ ఆడానని ఓ ఫుట్బాల్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
"సెమీస్కు మూడు రోజుల ముందు వెన్నులోని మూడు పూసలు కదిలాయి. దీంతో నొప్పి మొదలైంది. అయినా సెమీస్లో బెల్జియంపై 1-0తో గెలిచాం. ఈ విషయం ప్రత్యర్థులు పసిగట్టకుండా సహాయక సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గాయం గురించి ప్రత్యర్థులకు తెలిస్తే వాళ్లు దాన్ని అవకాశంగా తీసుకొని ఇంకా గాయపర్చేందుకు ప్రయత్నించేవాళ్లు"అని ఎంబాపే అన్నాడు.
"లేదంటే, దీనిని అవకాశంగా తీసుకుని సున్నితమైన భాగాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తారు. ప్రత్యర్థులకు ఏమాత్రం సమాచారం తెలియకుండా జట్టు గోప్యంగా ఉంచింది. ఫైనల్లో కూడా నొప్పితోనే ఆడా" అని ఎంబాపే అన్నాడు. గోల్డెన్ బాల్ అవార్డుకు తాను కూడా గట్టిపోటీదారుడిగా ఉన్నానని ఎంబాపే ఆశాభావం వ్యక్తం చేశాడు.
రష్యా వరల్డ్ కప్లో అత్యంత ఆకర్షణీయ ప్లేయర్గా ఎంబాపే గుర్తింపు తెచ్చుకున్నాడు. టోర్నీ ఆసాంతం జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఎంబాపే.. ఫైనల్లో క్రొయేషియాపై గోల్ చేసి ఫుట్బాల్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. టోర్నీలో అనంతరం ఎంబాపే అత్యుత్తమ యువ ఆటగాడు అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.
అత్యుత్తమ గోల్ అతడిదే
ఇదిలా ఉంటే ఫిఫా వరల్డ్ కప్లో నమోదైన అత్యుత్తమ గోల్ ఏదో తెలిసిపోయింది. అభిమానుల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఫిఫా బుధవారం రష్యాలో జరిగిన వరల్డ్కప్లో నమోదైన అత్యుత్తమ గోల్ అవార్డును ప్రకటించింది. ఆ అవార్డు ఫ్రాన్స్కు చెందిన బెంజమిన్ పవార్డ్ అందుకున్నాడు. అర్జెంటీనాతో జరిగిన నాకౌట్ మ్యాచ్లో 57వ నిమిషంలో అతను చేసిన గోల్ అభిమానులను ఎంతగానో అలరించింది. 16 మీటర్ల దూరం నుంచి అతను కొట్టిన గోల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.