
హైదరాబాద్: కొన్ని రోజుల క్రితం శ్రీనగర్ వీధుల్లో పోలీసుల పైకి రాళ్లు రువ్వి జాతీయ మీడియాలో సంచలనమైన ఆఫ్షాన్ అషీక్ గుర్తుందా? ఇప్పుడు ఆ అమ్మాయి కాశ్మీర్ తొలి మహిళా ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఫుట్బాల్పై తనకున్న మక్కువతో అంచలంచెలుగా ఎదిగింది.
మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో సమావేశమైన 21 మందితో కూడిన జమ్మూ కాశ్మీర్ పుట్బాల్ జట్టులో అషీక్ కూడా ఉంది. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నాడు పోలీసుల మీదకు రాయి విసిరిన యువతి నేడు హోం మంత్రి పక్కన ఉందని నెటిజన్లు అషీక్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రాజ్నాథ్ సింగ్ను కలిసిన సందర్భంగా అషీక్ రాళ్లు రువ్విన స్థాయి నుంచి జట్టుకు కెప్టెన్గా ఎదిగిన వైనాన్ని మీడియాతో పంచుకుంది. 'ఆ రోజు జరిగిన సంఘటన నా జీవితాన్ని మార్చేసిందని, మా ఆత్మరక్షణ కోసమే అలా ప్రవర్తించాల్సి వచ్చింది. కానీ మీడియా తానొక ఆందోళనకారిణిగా ముద్రవేసింది' అని ఆమె పేర్కొంది.
'ఆ తర్వాత తన జీవితం పూర్తిగా మారింది. ఏదైనా సాధించాలన్న కసితో ఉన్న నేను రాష్ట్రం, దేశం గర్వపడేలా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. దీంతో మరెంతో మంది ప్రతిభ కల్గిన క్రీడాకారులు వెలుగులోకి వస్తారు' అని అషీక్ తెలిపింది.
'కాశ్మీర్ తొలి ఫుట్బాల్ జట్టును కలిశాను. వీరు కాశ్మీర్ లోయలోని యువతి యువతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కెరీర్ విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని రాజ్నాథ్ సింగ్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
అసలు ఆరోజు ఏం జరిగింది?
ఏప్రిల్ 24వ తేదీ. మంగళవారం మధ్యాహ్నం 21 ఏళ్ల ఫుట్బాల్ కోచ్ అయిన ఆఫ్షాన్ అషీక్ తాను శిక్షణ ఇచ్చే దాదాపు 15 మంది విద్యార్థినులను తీసుకొని కోఠి బాగ్ నుంచి టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్లో ఉన్న ఫుట్బాల్ మైదానానికి బయల్దేరారు. ఫుట్బాల్ మైదానికి చేరుకోవడానికి దాదాపు 15 నిమిషాలు పడుతుంది.
ఇంతలో ఆ వీధిలో అల్లరి మూక రాళ్లను రువ్వడం ప్రారంభించింది. అక్కడ ఓ పోలీసు అధికారి ఆఫ్షాన్ అషీక్ టీమ్లోని అమ్మాయిలను పిలిచి అసభ్యంగా మాట్లాడటంతో పాటు ఓ అమ్మాయిపై చేయి చేసుకున్నారు. ఆఫ్షాన్ అషీక్ వెళ్లి తాము ఎవరమో, ఎక్కడికి వెళుతున్నామో ఆ పోలీసు అధికారికి చెప్పే ప్రయత్న చేసింది.
అయితే ఆ పోలీసు అధికారి వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో 'మీరు యూనిఫామ్లో ఉన్నారు కనుక మేము మీపై చేయిచేసుకోలేం. కాస్త ఇటువైపు వీధిలోకి రండీ, మీ సంగతి చెబుతాం' అని ఆసిక్ ఓ పోలీసు అధికారిని హెచ్చరించింది.
అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోతుంటే పోలీసు అధికారి తనను దూషించడంతో అనుకోకుండానే ఆవేశంలో ఆఫ్షాన్ అషీక్ రోడ్డుపైనున్న ఓ రాయిని అందుకొని బలంగా పోలీసులపైకి రువ్వింది. రాయి విసురుతున్న సమయంలో తీసిన ఫోటోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ సంస్ధ రాయిటర్స్ ప్రచురిచండంతో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.