సంచలనాలకు వేదికగా మారిన ఫిఫా వరల్డ్ కప్లో మరో సంచలనం నమోదైంది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో 'గ్రూప్ ఆఫ్ డెత్' అని పేరుబడిన గ్రూప్ ఈ నుంచి జపాన్, స్పెయిన్ నాకౌట్స్ చేరుకున్నాయి. ఈ క్రమంలో నాలుగు సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన జర్మనీ ఇంటి దారి పట్టడం ఫుట్బాల్ అభిమానులు అందరికీ షాకిచ్చింది.
తమ తొలి మ్యాచ్లో 7 గోల్స్ తేడాతో నెగ్గిన స్పెయిన్.. జపాన్తో మ్యాచ్ను డ్రా చేసుకున్నా నాకౌట్స్ చేరుతుంది. ఇలాంటి నేపథ్యంలో మ్యాచ్ ప్రారంభించిన స్పెయిన్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఆట మొదలైన పదో నిమిషంలోనే స్పెయిన్ ప్లేయర్ అల్వారో మొరాటా గోల్ చేశాడు. దీంతో స్పెయిన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత జపాన్కు గోల్ చేసే అవకాశమే ఇవ్వలేదా జట్టు. విజయంతో గ్రూప్ టాపర్గా నిలిచేందుకు ప్రయత్నించింది. దీంతో తొలి హాఫ్ను ఆధిక్యంలోనే ముగించింది.
అయితే మ్యాచ్ సెకండ్ హాఫ్లో జపాన్ దూకుడు పెంచింది. రెండో హాఫ్ మొదలైన మూడో నిమిషంలోనే జపాన్ ప్లేయర్ రిత్సు డోన్ అద్భుతమైన గోల్తో స్కోర్లు సమం చేశాడు. ఇది జరిగిన మూడు నిమిషాల్లోనే టనాక మరో గోల్ చేసి జపాన్ను ఆధిక్యంలో నిలిపాడు. అయితే ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. ఎందుకంటే రెండో గోల్ చేసే క్రమంలో బంతి ఆట పరిధిని దాటి బయటకు వెళ్లినట్లు కనిపించింది. కానీ వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా టనాక చేసిన గోల్ను లెక్కలోకి తీసుకున్నాడు. దీంతో జపాన్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.
ఆ తర్వాత మరో గోల్ చేసి స్కోర్లు సమం చేయడానికి స్పెయిన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించిన జపాన్.. గ్రూప్ ఈ టాపర్గా నాకౌట్స్లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో జర్మనీ జట్టు అనూహ్యంగా ఇంటి దారి పట్టింది. ఈ మ్యాచ్లో స్పెయిన్ నెగ్గితే జర్మనీ కూడా నాకౌట్స్ చేరేది. ఇక జపాన్ తమ తర్వాతి మ్యాచ్లో గత వరల్డ్ కప్ రన్నరప్లు క్రొయేషియాతో తలపడనుంది. అదే సమయంలో తొలి నాకౌట్ మ్యాచ్లో మొరాకోను ఢీకొట్టేందుకు స్పెయిన్ సిద్ధం అవుతోంది.