పుణె: సొంత రాష్ట్రానికే చెందిన ముంబై సిటీ ఎఫ్సి క్లబ్తో ఓటమి తమకు కఠినమైన ఫలితమేనని, దాన్ని అంగీకరించడం కష్టమేనని పుణె మిడ్ఫీల్డర్ అరాట ఇజుమి వ్యాఖ్యానించాడు. తాము మరింత మెరుగ్డా ఆడాల్సి ఉందన్నాడు. తదుపరి మ్యాచ్పై దృష్టి పెట్టామని, మరింత శక్తిమంతంగా ముందుకు వస్తామని ఇజుమి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
సోమవారం ముంబైతో జరిగిన మ్యాచ్లో పుణె 1 - 0 స్కోర్ తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ప్రారంభంలోనే తమ జట్టు పదో నిమిషానికే గోల్కోసం చేసిన ప్రయత్నాన్ని ముంబై గోల్కీపర్ రాబర్టో వోల్పాటో అడ్డుకున్నాడని తెలిపాడు.
సెకండ్ హాఫ్లో స్ఫూర్తిదాయకమైన రీతిలో స్పందించాలని ఇజుమి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాము బాగానే ఆడినా పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని వ్యాఖ్యానించాడు. తాము కొన్ని అంశాల్లో మెరుగు పడాల్సి ఉందని, తదుపరి మ్యాచ్లో పోరాడేందుకు తప్పనిసరిగా సిద్ధం అవుతామని ఇజుమి ధీమా వ్యక్తంచేశాడు.
ఉల్లాసంగా ముంబై మిడ్ఫీల్డర్ హాల్డర్
తొలి లీగ్ మ్యాచ్లో ఎఫ్సి పుణె సిటీపై విజయంతో ముంబై సిటీ మిడ్ఫీల్డర్ ప్రొనాయ్ హాల్డర్ ఉల్లాసంగా ఉన్నాడు. తాము చేసిన తొలి గోల్తోనే విజయం సాధించామని తమకు తెలుసునని హాల్డర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
మ్యాచ్లో గెలుపొందడం సంతోషంగా ఉందని అన్నాడు. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే కేవలం ఒక్క పాయింట్ మాత్రమే వచ్చేదని, కానీ విజయంతో తమ జట్టు మూడు పాయింట్లు సాధించడం గర్వంగా ఉందని హాల్డర్ వ్యాఖ్యానించాడు.
తమ జట్టు సభ్యులంతా సమిష్టిగా ఆడారని, అందువల్లే మ్యాచ్లో గెలవగలిగాం అని, అందుకు గర్వంగా ఉన్నదని తెలిపాడు. కోచ్ సూచనలకు అనుగుణంగా ఆడితే ఖచ్చితంగా విజయం తమదేనని విశ్వాసం వ్యక్తంచేశాడు. తొలి మ్యాచ్లో విజయంసాధించిన తాము భవిష్యత్లో మెరుగు పడేందుకు చాన్స్ ఉందని తెలిపాడు.
అభిషేక్తో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ చూడొచ్చు!
న్యూఢిల్లీ: అభిమానుల్లారా! పారాహుషార్!! ఆ అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. బాలీవుడ్ సూపర్స్టార్ బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్తో కలిసి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించే అవకాశం అందుబాటులో ఉంది.
ఈ నెల 23వ తేదీన లండన్లోని స్టాంఫోర్డ్ బ్రిడ్జి వద్ద గల స్టేడియంలో మాంచెస్టర్ యునైటెడ్, చెల్సియా జట్ల మధ్య జరిగే మ్యాచ్కు అభిషేక్ బచ్చన్ హాజరు కాబోతున్నారు. కనుక ఆయన పక్కనే కూర్చుని మ్యాచ్ను వీక్షించేందుకు ఆన్లైన్ రాఫిల్ ఆర్గనైజర్ 'బైమై టైం డాట్కామ్' అవకాశం కల్పిస్తుంది.
అయితే అభిమానులు చేయాల్సిందల్లా ఒక్కటే! రూ.300లతో ఆన్లైన్లో టిక్కెట్ కొనుగోలుచేయడమే.
వికలాంగుల అభ్యున్నతి కోసం ఏర్పాటైన 'సామర్థనం' ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వెబ్సైట్.. ముంబై, బెంగళూర్ నగరాల్లో టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు కొనుగోలుచేసిన వారిలో నలుగురు లక్కీ విన్నర్లను ఎంపికచేసి లండన్కు పంపే ఏర్పాట్లు చేస్తుంది.
'గ్లిడ్ ఫౌండేషన్కు లబ్ధి చేకూర్చేందుకు వారెన్ బఫెట్ ప్రతియేటా వేలం నిర్వహిస్తూ ఉంటారు. దీని ద్వారా నేను స్ఫూర్తి పొందా. ఏళ్ల తరబడి గ్లిడ్ ఫౌండేషన్ సాధించిన సాధికారత అద్భుతం. ఈ ఏడాది ఆ ఫౌండేషన్వద్ద 30 లక్షల డాలర్లకు పైగా విరాళాలు సేకరించగలిగింది' అని బై మై టైం డాట్కాం ఎండీ సంపత్కుమార్ తెలిపారు.