కోల్కతా: సారధి హెల్డర్ పొస్టిగ గైర్హాజరీతోపాటు గాయంతో బాధపడుతున్న సెంట్రల్ బ్యాక్ తిరి తదితరులు లేకుండానే అట్లెటికో డీకోల్ కతా ఆదివారం సొంత గడ్డపై ఎఫ్సి గోవా జట్టుతో జరిగే మ్యాచ్ లో పూర్తి పాయింట్లు సాధించాలని పట్టుదలగా ఉంది. ఐఎస్ఎల్ 3 ఎడిషన్ లో పసలేని ఆటతీరు ప్రదర్శిస్తున్న గోవాపై.. గాయాలతో సతమతమవుతున్న కోల్ కతా విజయం సాధిస్తుందా? అన్న అనుమానాలు ఉన్నాయి.
గత ఏడాది నుంచి బెంచ్ కే పరిమితమైన పొస్టిగ శనివారం కొద్దిసేపు మాత్రమే ప్రాక్టీస్ లో కొనసాగగలిగాడు. ముంబై సిటీతో డ్రాగా ముగించిన మ్యాచ్ లోనూ పాల్గొనని పొస్టిగ ఆదివారం గోవాతో జరిగే మ్యాచ్ లో ఆడటం అనుమానమే. ముంబై సిటీతో జరిగిన మ్యాచ్ లో గాయపడిన తిరి స్థానంలో కొత్తగా జట్టులో చేరిన పోర్చుగీస్ సెంట్రల్ డిఫెండర్ హెంరిక్యూ సెరెనో బరిలోకి దిగనున్నాడు.
కానీ వరుసగా మూడు ఓటమిలతో విజయం కోసం కసిగా ఎదురుచూస్తున్న గోవాపై తమ సొంతగడ్డపై జరిగే మ్యాచ్ లో విజయం సాధించగలమని పొస్టిగ సేన విశ్వసిస్తోంది. కెనడియన్ స్ట్రయికర్ ఇయాన్ హుమ్ ఇప్పటికీ తన ఫెర్ఫార్మెన్సేమిటో రుజువుచేసుకోనే లేదు. ముంబై, కేరళలతో జరిగిన మ్యాచ్ ల్లో స్పానిష్ వింగర్ జావీ లారా కోల్ కతాకు కీలక ప్లేయర్ కానున్నాడు.
బ్రెజిలియన్ రాఫెల్ దుమాస్ సెంట్రల్ బ్యాక్ లో స్ఫూర్తి దాయక ఆట ఆడుతున్నాడు. గత మ్యాచ్ లో పాల్గొన్న జట్టునే కోచ్ మొలీనా తిరిగి బరిలోకి దించే అవకాశాలు పుష్కలం. సమీగ్ దౌటీ, జావీ లారాలను ఇరువైపులా పిచ్ చివర్లో మోహరించనున్నాడు. ఇప్పటివరకు కీలక ప్లేయర్ గా ఉన్న ఇయాన్ హుమ్ ను స్ట్రయికర్ పాత్ర నుంచి తప్పించే చాన్స్ ఉంది.
గత ఏడాది ఫైనల్ వరకూ దూసుకొచ్చిన ఎఫ్ సి గోవా ఈ సీజన్ లో ఆఫ్ ఫీల్డ్ సమస్యలతో సతమతమవుతున్నది. గాయాల పాలైన ఆటగాళ్లంతా ఫిట్ గా ఉన్నారని నిర్ధారించిన తర్వాత మ్యాచ్ ఆడుతున్న సమయంలో తమలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీయడంలో గోవా కుర్రాళ్లు వెనుకాడుతున్నారు.
ఆదివారం మ్యాచ్ లో రాబిన్ సింగ్, గ్రెగరీ ఆర్నోలిన్, డెంజిల్ ఫ్రాంకో పాల్గొంటారని గోవా మీడియా మేనేజర్ ధ్రువీకరించాడు. గతేడాది ఫైనల్స్ లో జట్టుకు స్ఫూర్తిగా నిలిచిన గోల్ కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమని ఈ సీజన్ లో అత్యంత సాధారణమైన ఆటగాడిలా వ్యవహరిస్తుండటం గోవా ఫ్రాంచైసీ యాజమాన్యానికి సమస్యగా పరిణమించింది. 2014 సెమీస్ తోపాటు ఐదుసార్లు కోల్ కతాతో పోటీ పడిన ఎఫ్ సి గోవా ఏ మ్యాచ్ లోనూ విజయం సాధించలేదు.
హబస్, మోలినాలది ఒకటే స్టయిల్: బోర్జా
మాజీ కోచ్ అంటోనియో హబాస్, ప్రస్తుత శిక్షకుడు జోస్ మొలీనాలదే ఒకటే తరహా ఆట అని డిఫెన్సివ్ మిడ్ ఫీల్డర్ బొర్జా ఫెర్నాండెజ్ వ్యాఖ్యానించాడు. హబస్, మొలీనా ఆలోచనలు ఒకే రకంగానే ఉన్నా... భిన్నత్వం కూడా ఉన్నదని తెలిపాడు. భారత ఆటగాళ్లలో మెరుగుదల కనిపిస్తున్నదని, నైపుణ్యాన్ని సంపాదించేందుకు ఇతర దేశాలు కూడా భారత్ ఫార్ములానే పాటించాలని సూచించాడు.
హబాస్ జట్టుకు ఒక టైటిల్ సాధించి పెట్టగా, మరో దఫా సెమీస్ వరకూ దూసుకెళ్లింది. కోచ్ మొలీనా మాట్లాడుతూ తనకు తన జట్టుపై ఎల్లవేళలా విశ్వాసం ఉన్నదని, ప్రతి మ్యాచ్ లోనూ పోరాడి విజయం సాధించాలని, తదుపరి మ్యాచ్ లో తమ జట్టు భారీ మెజారిటీతో గెలుపొందాల్సిన అవసరం ఉన్నదన్నాడు. కొత్తగా సెరెనో వారం పాటు జట్టుతో ఆడతాడని, తిరి స్థానంలో సెరెనో సేవలను ఉపయోగించుకుంటామని మొలీనా తెలిపాడు.
ఫుట్ బాల్ లో దేశీయ ఆటగాళ్ల ప్రాతినిధ్యం పెరగాలి
ఫుట్ బాల్ ఆడేందుకు భారతీయులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఈ ఆటలో భారతీయ ఆటగాళ్ల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉన్నదని ఎఫ్ సి గోవా హెడ్ కోచ్ జికో వ్యాఖ్యానించాడు. ఐఎస్ఎల్ లో భారతీయుల కంటే విదేశీ ఆటగాళ్లు పాల్గొనడం వల్ల ఉపయోగం ఉండదని, ఈ మూడేళ్లలో పరిస్థితిలో మార్పు రాలేదన్నాడు.
పూర్తిస్థాయిలో 11 మంది ఆటగాళ్లూ భారతీయులతోనే మ్యాచ్ ప్రారంభించడం బెటరన్నాడు. భారత్ నేషనల్ టీంలోనూ ఎటువంటి పురోగతి లేదని జికో తెలిపాడు. ఓవరాల్ గా భారత క్రీడాకారుల్లో ఆటలో నైపుణ్యం పెంపొందించేందుకు చాలా కాలం పడుతుందని, ఐఎస్ఎల్ లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, కీలక స్థానాల్లో భారతీయులు ఆడేందుకు ముందుకు రావాలని సూచించాడు.
ప్రస్తుతం స్ట్రయికర్, మిడ్ ఫీల్డర్ స్థానాల్లో విదేశీ ఆటగాళ్లే ఉన్నారని తెలిపాడు. సుదీర్ఘ కాలం ఐఎస్ఎల్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించడంతోనే భారత్ ఫుట్ బాల్ కు మెరుగైన భవిష్యత్ ఉన్నదన్నాడు. అట్లెటికో డీ కోల్ కతా మెరుగ్గా ఆడుతున్నదని, వారిని నిలువరించేందుకు తాము ప్రయత్నిస్తామన్నాడు. ప్రస్తుతం తమ జట్టుకు గాయాల బెడద లేదని ధ్రువీకరించాడు.