పనాజీ: కరోనా దెబ్బతో యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. ఆటలన్నీ ఆగమయ్యాయి. దాంతో ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ఫుట్బాల్ లీగ్ 'ఏ లీగ్'కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. కరోనా లాక్ డౌన్తో టోర్నీకూడా నిలిచిపోయింది. దాంతో అధికారిక బ్రాడ్ కాస్టర్ ఫాక్స్ స్పోర్ట్స్ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఫలితంగా ఆటగాళ్ల జీతాలపై ప్రభావం పడనుంది. వచ్చే సీజన్లో 30 శాతం కోత పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది
ఈ పరిస్థితుల్లో 'ఏ' లీగ్ ఆటగాళ్లకు ఐఎస్ఎల్ ఆర్థికంగా అండగా నిలిచింది. గత సీజన్లో కేవలం ఇద్దరు ఆటగాళ్లే ఉండగా.. ఈ సీజన్లో వారి సంఖ్య పది మందికి చేరింది. ప్రతీ జట్టులో ఒకరు ఉన్నారు. నాన్ ఆస్ట్రేలియన్ ఏ లీగ్ ఆటగాళ్లు కూడా ఐఎస్ఎల్ బరిలో నిలిచారు.
క్వారంటైన్ నిబంధనలు ఉండటంతో టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు నెల రోజులు ముందుగానే గోవాకు చేరుకున్నారు. ఇక టైటిల్ కోసం పోటీ పడే జట్ల సంఖ్య ఈ సారి పెరిగింది. లీగ్లోకి కొత్తగా స్పోర్టింగ్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ వచ్చి చేరడంతో... జట్ల సంఖ్య 11కు చేరింది. టైటిల్ ఫేవరెట్లుగా డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్, మాజీ చాంపియన్ బెంగళూరు ఎఫ్సీ కనిపిస్తున్నాయి.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రతిపాదించిన ఐదుగురు సబ్స్టిట్యూట్ నిబంధన ఐఎస్ఎల్ 2020లో కూడా కొనసాగనుంది. దాంతో మ్యాచ్ మధ్యలో ఒక జట్టు గరిష్టంగా ఐదుగురు సబ్స్టిట్యూట్లను ఆడించవచ్చు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మూడు సందర్భాల్లో మాత్రమే వీరిని బరిలోకి దించాలి. అంతేకాకుండా సబ్స్టిట్యూట్ బెంచ్ను ఏడుగురి నుంచి తొమ్మిదికి పెంచారు. ఇది అన్ని జట్లకు కలిసిరానుంది.
రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిన జరిగే ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీ ఫైనల్స్ జరుగుతాయి. కరోనా ఉండటంతో ఈ సారి ఇంటా, బయట పద్ధతిలో కాకుండా.. ఒకే చోట సెమీస్ మ్యాచ్లు జరుగుతాయి. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి.