
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఏడో సీజన్లో ఒడిశా ఎఫ్సీ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఐఎస్ఎల్ ఏడో సీజన్లో ఇప్పటిదాకా బోణీ చేయని ఏకైక జట్టుగా ఉన్న ఒడిశా ఎఫ్సీ ఆ ముద్రను తాజా విజయంతో తొలగించుకుంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఒడిశా 4-2తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీపై విజయం సాధించింది. ఒడిశా స్ట్రయికర్ డీగో మౌరిసియో చెలరేగాడు. పది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
జోర్డాన్ ముర్రే (7వ నిమిషంలో) గోల్తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ ఆధిక్యం సాధించింది. అయితే కేరళ ఆటగాడు జీక్సన్ సింగ్ (22వ నిమిషంలో) సెల్ఫ్ గోల్ కొట్టడంతో ఒడిశా స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి ఆ ఒడిశా ఎఫ్సీ గొప్పగా పుంజుకుంది. స్టీవెన్ టేలర్ (42వ నిమిషంలో) గోల్ చేసి.. విరామానికి ముందు ఆ జట్టును 2-1తో నిలిపాడు. రెండో అర్ధభాగంలో డీగో మారిసియో (50వ, 60వ నిమిషాల్లో) పది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టడంతో ఒడిశాకు తిరుగులేకుండా పోయింది. అయితే చివర్లో కేరళ ఆటగాడు గ్యారీ హూపర్ (79వ నిమిషంలో) గోల్ చేయడంతో ఒడిశా ఆధిక్యం తగ్గింది.
గత ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు ఓటములు, రెండు డ్రాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఒడిశా ఎఫ్సీ.. గురువారం మాత్రం అద్భుత ఆటతో ఆకట్టుకుంది. 9 మ్యాచ్లాడిన ఒడిశా ఆరు పోటీల్లో ఓడిపోగా.. ఒకటి గెలిచి, రెండు మ్యాచ్ల్ని డ్రా చేసుకుంది. విజయం సాధించినా.. 5 పాయింట్లతో ఒడిశా చివరి స్థానంలోనే నిలిచింది. కేరళ బ్లాస్టర్స్ 6 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్ టాప్-2లో ఉన్నాయి. శుక్రవారం జరిగే పోరులో హైదరాబాద్ ఎఫ్సీతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ తలపడుతుంది.