భారత మహిళా హాకీ జట్టు తన సత్తాను చాటుకుంది. అద్భుతమైన ప్రదర్శనతో 'ఎఫ్ఐహెచ్ (FIH) హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్-2026' ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ 2026 టోర్నమెంట్ సెమీఫైనల్ పోరులో ఇటలీని మట్టికరిపించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. శుక్రవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా హాకీ జట్టు అద్భుతంగా ఆడింది. సెమీఫైనల్స్లో ఇటలీతో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ 1-0 స్కోరుతో విజయం సాధించి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.
మనీషా చౌహాన్ మెరుపు గోల్
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తొలి క్వార్టర్ నుంచే భారత్ దూకుడు పెంచినా ఇటలీ డిఫెన్స్ పటిష్టంగా ఉండటంతో గోల్ కోసం వేచి చూడాల్సి వచ్చింది. చివరకు 40వ నిమిషంలో మనీషా చౌహాన్ అద్భుతమైన డ్రాగ్-ఫ్లిక్తో బంతిని ఇటలీ గోల్ పోస్ట్లోకి పంపి భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ గోల్ ఈ మ్యాచ్లో నిర్ణయాత్మకమైంది.

గోల్ కీపర్ బిచ్చు దేవి అద్భుత రక్షణ
మ్యాచ్ చివరి దశలో ఇటలీ జట్టు భారత్పై తీవ్ర ఒత్తిడి పెంచింది. ముఖ్యంగా 59వ నిమిషంలో ఇటలీకి లభించిన కీలకమైన 'పెనాల్టీ కార్నర్'ను భారత డిఫెండర్లు, గోల్ కీపర్ బిచ్చు దేవి ఖారీబామ్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఆమె చూపిన చొరవ వల్ల ఇటలీకి గోల్ చేసే అవకాశం దక్కలేదు. అంతకుముందు కూడా ఇటలీ ప్లేయర్ ఎమిలియా మునిటిస్ చేసిన ప్రమాదకరమైన ప్రయత్నాన్ని బిచ్చు దేవి అద్భుతంగా అడ్డుకుని జట్టును కాపాడారు.
ఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడనున్న భారత్
వరల్డ్ కప్ క్వాలిఫయర్ టైటిల్ను కైవసం చేసుకునేందుకు భారత మహిళా హాకీ జట్టు ఈరోజు (మార్చి 14న) ఇంగ్లాండ్తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. నేటి(14న) రాత్రి 7:30 గంటలకు జరిగే ఫైనల్లో భారత్, ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇంగ్లాండ్ జట్టు కూడా ఫామ్లో ఉన్నందున, టైటిల్ పోరు మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళా జట్టుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఈ క్వాలిఫయర్ టైటిల్ను గెలిచి వరల్డ్ కప్లో చోటు సంపాదించుకోవాలని భారత హాకీ అభిమానులు ఆశిస్తున్నారు.