పాకిస్థాన్ వైస్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో సల్మాన్ అఘా రనౌట్ అయిన తీరుపై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్దమని కొందరంటే.. మరికొందరు కాదని వాదిస్తున్నారు.
నాన్స్ట్రైకర్లో ఉన్న సల్మాన్ అఘా.. బ్యాటర్ ఆడిన బంతి తన బ్యాట్కు తగలడంతో బౌలర్కు అందించే ప్రయత్నం చేశాడు. కానీ బౌలర్ బంగ్లాదేశ్ కెప్టెన్ అయిన మెహ్దీ హసన్ మిరాజ్ బంతిని వికెట్లకు కొట్టి రనౌట్ చేశాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన సల్మాన్ అఘా.. మైదానం వీడుతూ తన గ్లోవ్స్, బ్యాట్ను నేలకు కొట్టాడు.
ఈ చర్యను తప్పుబట్టిన ఐసీసీ.. మ్యాచ్ రిఫరీ నీయముర్ రషీద్ ఫిర్యాదుతో సల్మాన్ అఘా లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు తేల్చి ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. 'క్రికెట్ వస్తువలను అగౌరవపరిచినట్లు అఘాపై ఫిర్యాదు అందింది. మైదానంలోనే అతను హెల్మెట్, గ్లౌవ్స్, బ్యాట్ను విసిరేసినట్లు తేలింది. గతంలో అతని నుంచి ఇలాంటి ప్రవర్తన చూడలేదు. కానీ తాజాగా అతను ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకుంటున్నాం.

అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను జత చేశం. బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్తో వాగ్వాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అది కేవలం అపార్థంగా పరిగణించాం. మేం చట్ట ప్రకారమే నడుచుకున్నాం. నిష్పక్షపాతంగా వ్యవహరించి ఈ తీర్పు ఇచ్చాం.'అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది. 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్స్ వస్తే ఒక టెస్ట్ లేదా రెండు టీ20లు/ వన్డేలు ఆడకుండా నిషేధం విధిస్తారు.
తన రనౌట్ నిబంధనల ప్రకారం సరైనదే అయినా.. క్రీడాస్ఫూర్తికి విరుద్దమని సల్మాన్ అలీ అఘా అభిప్రాయపడ్డాడు. తానైతే క్రీడాస్ఫూర్తికే ప్రాధాన్యత ఇచ్చేవాడినని, పాకిస్థాన్ ఎప్పుడూ ఇలా చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోమని స్పష్టం చేశాడు. బంతి తన ప్యాడ్తో పాటు బ్యాట్కు తగలడంతోనే బౌలర్కు అందించాలనుకున్నాని, తనకు పరుగు తీసే ఉద్దేశం కూడా లేదని సల్మాన్ అఘా పేర్కొన్నాడు.
మరోవైపు మెహ్దీ హసన్ మిరాజ్ తన చర్యను సమర్థించుకున్నాడు. ఆ సమయంలో తాను బంతిని మాత్రమే చూశానని తెలిపాడు. ఒకవేళ ఆ బంతిని తాను వదిలేసి ఉంటే సల్మాన్ అఘా కచ్చితంగా పరుగు కోసం వెళ్లేవాడని పేర్కొన్నాడు. ఆ సమయంలో తన ఆలోచన ఇలానే ఉందన్నాడు.