ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా హెచ్చరిక జారీ చేశాడని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్ 2024 సీజన్కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
అప్కమింగ్ ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనంటూ జరుగుతున్న ప్రచారాన్ని ముంబై ఇండియన్స్ తోసిపుచ్చింది. అప్కమింగ్ సీజన్లో రోహిత్ శర్మ విఫలమైతే సహించేది లేదని హార్దిక్ పాండ్యా హెచ్చరించినట్లు ఒక సోషల్ మీడియా యూజర్ ఆరోపించాడు.ఈ విషయాన్ని హార్దిక్ మేనేజ్మెంట్కు తెలియజేసినట్లు ఆ పోస్ట్లో పేర్కొన్నాడు.
గత 10-12 ఏళ్లుగా రోహిత్ ప్రదర్శన పట్ల ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తిగా ఉందని, అత్యధిక వేతనం తీసుకుంటున్నప్పటికీ.. రోహిత్ ఆశించిన రీతిలో రాణించడం లేదన్నాడు. ప్రతీ సీజన్లో 200-300 పరుగులే చేస్తున్నాడని, అతని స్ట్రైక్రేట్ కూడా 120గానే ఉందని ఆ యూజర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.
అయితే ఈ పోస్ట్పై ముంబై ఇండియన్స్ అధికారికంగా స్పందించింది. హార్దిక్ పాండ్యా GIF ఫైల్తో "కుచ్ భీ (ఏదైనా)" అనే క్యాప్షన్తో ఈ ఊహాగానాలను కొట్టిపారేసింది.

గత ఐదేళ్లుగా ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవలేదు. ఈ సారి ఎలాగైనా ట్రోఫీ గెలుచుకొని సిక్సర్ కొట్టాలనే లక్ష్యంతో ఉంది. 2020లో చివరిసారిగా ముంబై టైటిల్ గెలిచింది. దశాబ్ద కాలం పాటు జట్టుకు సారథ్యం వహించి ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ 2024 సీజన్కు ముందు తప్పించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ చేసుకొని మరి కెప్టెన్సీ బాధ్యతలు
2024లో గుజరాత్ టైటాన్స్ నుండి హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకున్న తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ హార్దిక్ సారథ్యంలో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. గతేడాది ప్లే ఆఫ్స్ చేరినా.. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది.
గత 12 సీజన్లలో రోహిత్ శర్మ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 2013 తర్వాత ఏ సీజన్లోనూ రోహిత్ శర్మ 500 పరుగులు సాధించలేదు. గతేడాది 15 మ్యాచ్ల్లో 29.86 సగటుతో 418 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.