
హైదరాబాద్: అభిమాన క్రీడను వీక్షించేందుకు దూర ప్రయాణానికి వెళ్లిన అభిమాని.. తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. ప్రపంచకప్ మ్యాచ్లు చూసేందుకు రష్యా వెళ్లిన ఓ భారత అభిమాని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా వెల్లడించారు. వివరాల్లోకి వెళ్లితే భారత్కు చెందిన ఆదిత్య రంజన్ తన స్నేహితుడితో కలిసి రష్యాలో జరుగుతోన్న ఫిపా ప్రపంచకప్ పోటీలను చూసేందుకు వెళ్లారు.
శనివారం సోచి చేరుకున్నారు. పోర్చుగల్, ఉరుగ్వేల మధ్య జరిగే మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆదిత్య రంజన్ ఊహించని ప్రమాదంలో మృతి చెందాడు. ఐతే, స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం కుబన్ రీజయన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న భారతదేశానికి చెందిన వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
ఈ విషయాన్ని అక్కడి మీడియా వెల్లడించింది. క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ చనిపోయిన వ్యక్తి భారత్కు చెందిన ఆదిత్య రంజన్గా గుర్తించారు. స్థానిక భారత దౌత్యకార్యాలయం అధికారులు విషయాన్ని బాధితుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. మ్యాచ్లు చూడ్డానికి వెళ్లిన తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడనే వార్త విన్న ఆ కుటుంబం విషాదానికి లోనైంది.
నిబంధనల ప్రకారం మృతదేహానికి అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం భారత్కు పంపేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రష్యాలో ప్రస్తుతం జరుగుతోన్న ఫిఫా ప్రపంచకప్ పోటీలను తిలకించేందుకు వచ్చిన వారిలో ప్రాణాలు కోల్పోయిన ఏకైక వ్యక్తి ఆదిత్య అని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో రష్యాకు పర్యటకులుగా వెళ్లిన భారతీయుల గురించి మరింత సమాచారం కావాలంటే ఈ నంబర్లను సంప్రదించాలని రష్యాలోని ఇండియన్ సర్వీసు కొన్ని నెంబర్లను ట్విట్టర్లో ఉంచింది.