హైదరాబాద్: భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తోన్న ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ టోర్నీని ఇప్పటివరకు ఎలాంటి అవంతరాలు లేకుండా సాఫీగా నిర్వహించిన భారత్పై అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రశంసల వర్షం కురిపించింది.
అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ అధ్యక్షతన గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన 'ఫిఫా' టోర్నీల హెడ్ జైమే యార్జా మాట్లాడుతూ ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ను భారత్ విజయవంతం చేసిందని కొనియాడారు.
భారత్ ఆతిథ్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. రాబోయే రోజుల్లో సీనియర్ సాకర్ వరల్డ్ కప్ను నిర్వహించే సత్తా భారత్కు ఉందని ఆయన అన్నారు. 'ఈ టోర్నీ ఎంతటి విజయవంతమైందో వేలాది అభిమానుల హాజరు చూపుతోంది. కోట్లాది ప్రేక్షకుల టీవీ రేటింగ్ తెలుపుతోంది' అని తెలిపారు.
'అత్యధిక సంఖ్యలో ప్రత్యక్షంగా మ్యాచ్లను చూసిన జూనియర్ ప్రపంచకప్గా ఘనతకెక్కింది. మ్యాచ్లు సాగిన తీరు, ఘనమైన నిర్వహణ, వాడిన సాంకేతిక నైపుణ్యం అన్ని అత్యున్నతంగా ఉన్నాయి. ఓ అద్భుతమైన టోర్నమెంట్ను భారత్ ఆవిష్కరించింది. ఇపుడు భారత్ కూడా ఫుట్బాల్ దేశమైంది' అని యార్జా పేర్కొన్నారు.
ఈ టోర్నీలో భారత జట్టు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పోరాడిందని ఆయన అన్నారు. ఇక, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ 2019లో జరిగే అండర్-20 ప్రపంచకప్కు కూడా బిడ్ వేస్తామని చెప్పుకొచ్చారు.
భారత్ ఇప్పుడు ఫుట్బాల్ దేశం: ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినొ
భారత్ ఇప్పుడు అసలైన ఫుట్బాల్ దేశంగా అవతరించిందని ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినొ అన్నాడు. అండర్-17 ప్రపంచకప్ ఫైనల్ తిలకించడానికి జియోని భారత్కు వచ్చిన ఆయన మాట్లాడుతూ 'భారత్ ఇప్పుడు ఫుట్బాల్ దేశం. అండర్-17 ప్రపంచకప్ను ఇంతగా ఆదరించి విజయవంతం చేసినందుకు భారతీయులందరికి కృతజ్ఞతలు. ఇక్కడికి రావడం చాలా సంతోషాన్ని ఇస్తోంది' అని అన్నాడు.