క్రికెట్ అంటే పిచ్చి:
లైవ్ సందర్భంగా తమకు ఇష్టమైన క్రీడ ఏది అని సునీల్ ఛెత్రీ అడగ్గా.. క్రికెట్ అని శశి థరూర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా శశి థరూర్ మాట్లాడుతూ... 'నేను ఫుట్బాల్ చూడను. కానీ నా ఇద్దరు పిల్లలు ఆ క్రీడను ఎక్కువగా చూస్తారు. ఇక నా విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఎంతో పిచ్చి. ఏడేళ్ల వయసులో మా నాన్నతో కలిసి తొలిసారి టెస్టు మ్యాచ్ చూశా. ఎంతో గొప్పగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రికెట్నే చూస్తున్నా' అని తెలిపారు.
ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే చెప్పలేను:
'క్రికెట్ ఆటలో నా ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే నేను చెప్పలేను. ఎందుకంటే.. ఈ జాబితాలో చాలా మంది ఉన్నారు. అర్ధ శతాబ్దానికి పైగా క్రికెట్ చూస్తుంటే.. చాలా మంది ఇష్టమైన క్రికెటర్లు ఉంటారు కదా. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు బాగా నచ్చుతారు. కొందరి బ్యాటింగ్ బాగుంటుంది, మరికొందరిది బౌలింగ్.ఒక్కొక్కరిలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒకవేళ 20మంది ఫేవరెట్ క్రికెటర్లను ఎంపిక చేసుకోవాలంటే నాకు సులువవుతుంది' అని శశి థరూర్ అన్నారు.
మొదటగా ఇష్టపడిన క్రికెటర్ ఎంఎల్ జయసింహ:
మొదటగా ఇష్టపడిన క్రికెటర్ ఎవరు అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను సునీల్ ఛెత్రీ అడుగగా... 'నేను మొదటగా ఎంతో ఇష్టపడిన క్రికెటర్ ఎంఎల్ జయసింహ. ఆయన ఎంతో ఆకర్షణీయమైన ప్లేయర్. ఆ తర్వాత ఎంఏకే పటౌడిని ఎంతో ఇష్టపడ్డా. ఒక కన్ను కోల్పోయినా.. ఆయన గొప్ప బ్యాట్స్మన్గా ఎదిగారు. ఎన్నో రికార్డులను బ్రేక్ చేశారు. ఆ తర్వాత ఈ జాబితా అలా పోతూనే ఉంది' అని శశి థరూర్ బదులిచ్చారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు కూడా సచిన్ టెండూల్కర్ కంటే జయసింహనే ఇష్టం.
భారత్ తరఫున 72 గోల్స్:
భారత్లో ఫుట్బాల్ అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రీ. మన దేశంలో ఎంతో మంది గొప్ప ప్లేయర్లలో ఈ భారత ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ ఒకడు. దేశం తరఫున అత్యధిక ఇంటర్నేషనల్ గోల్స్ చేసిన సునీల్.. కెరీర్ ప్రారంభంలో ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చిన రోజులున్నాయని చెప్పాడు. ఆ టైమ్లో ఆటనే వదిలేద్దామని కూడా అనుకున్నానని తెలిపాడు. చివరకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇంతవరకు రాగలిగానన్నాడు. సికింద్రాబాద్లో జన్మించిన ఛెత్రీ.. 2005లో భారత్కు తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. అప్పటికే భూటియా, రెనెడీ సింగ్ లాంటి వాళ్ల పోలికలతో అతనిపై చాలా ఒత్తిడి ఉండేది. 18 ఏళ్ల తన తన ఫుట్బాల్ కెరీర్లో ఛెత్రీ భారత్ తరఫున 72 గోల్స్ చేశాడు.