ఫుట్బాల్ లెజెండ్ పీలే ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. 20వ శతాబ్దంలో జన్మించిన అత్యుత్తమ ఫుట్బాల్ ఆటగాడిగా చెప్పుకునే పీలే మరణంపై ఫిఫా సంతాపం తెలిపింది. పీలే మరణ వార్త విన్న తర్వాత జ్యూరిచ్లోని ఫిఫా ప్రధాన కార్యాలయంలో అన్ని దేశాల జెండాలను కిందకు దించి ఎగరేసింది. పుట్బాల్ ప్రపంచానికి పీలే మరణం తీరని లోటని పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే పీలేకు నివాళులు అర్పించడానికి బ్రెజిల్ చేరుకున్న ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో కీలక ప్రకటన చేశాడు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒక ఫుట్బాల్ స్టేడియానికి పీలే పేరు పెట్టాలని అడుగుతామని చెప్పాడు. 24 గంటలపాటు పీలేకు నివాళులు అర్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దక్షిణ అమెరికా, బ్రెజిల్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ల అధినేతలతో కలిసి ఇన్ఫాంటినో పాల్గొన్నారు.
పీలే తొలిసారి శాంటోస్ ఫుట్బాల్ క్లబ్ తరఫున తన నైపుణ్యాన్ని ప్రదర్శించి, ప్రజలందరి చేత మన్ననలు పొందిన విలా బెల్మీరో స్టేడియంలో ఇన్ఫాంటినో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ స్టేడియంలోనే పీలే అంతర్జాతీయ కెరీర్ మలుపు తిరిగింది. చివరకు అందరి చేత 'ది కింగ్' అనిపించుకున్నాడు.
పీలేకు నివాళులు అర్పించిన మొట్టమొదటి వారిలో ఇన్ఫాంటినో ఉండటం గమనార్హం. 'పీలే ఎప్పటికీ మనల్ని వీడి వెళ్లరు. ఆయన గ్లోబల్ ఫుట్బాల్ ఐకాన్' అని ఇన్ఫాంటినో స్పష్టం చేశారు. 82 ఏళ్ల వయసు ఉన్న పీలే.. కేన్సర్తో పోరాడుతూ గత సోమవారం నాడు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఫుట్బాల్ చరిత్రలో మూడు సార్లు ఫిఫా వరల్డ్ కప్ నెగ్గిన ఏకైక ఆటగాడు పీలే. తాజాగా ముగిసిన ఫిఫా వరల్డ్ కప్లో కూడా బ్రెజిల్ ఆటగాళ్లు పీలేను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆస్పత్రిలో కేన్సర్తో పోరాడుతున్న పీలే త్వరగా కోలుకోవాలంటూ బ్యానర్తో ప్రదర్శన చేశారు.