లండన్: ఇంగ్లండ్ ఫుట్బాల్ క్రీడాకారులపై జాతివివక్ష వ్యాఖ్యలు, దూషణకు దిగిన 49 మందిని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వెంబ్లీ స్టేడియం వెలుపల మరియు సెంట్రల్ లండన్లో జరిగిన హింసాత్మక ఘటనలో 19 మంది అధికారులు గాయపడ్డారు. టిక్కెట్ లేని అభిమానులు స్టీవార్డ్లతో గొడవ పడడం, మ్యాచ్కు ముందు వెంబ్లీ గేట్ వద్ద చేసిన నినాదానాలకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఆదివారం ఇటలీతో జరిగిన యూరోకప్ ఫైనల్లో ఇంగ్లండ్ త్రుటిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. స్కోర్లు 1-1తో సమం కావడంతో.. విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. అందులో ఇటలీ 3-2 తేడాతో విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్ జట్టులోని ముగ్గురు నల్ల జాతీయులు (మార్కస్ రష్ఫోర్డ్, బుకాయో సకా, జడాన్ సాంచో) పెనాల్టీ కిక్స్ను గోల్స్గా మలచలేకపోయారు. మ్యాచు ఓడిపోగానే సోషల్మీడియాలో, బయట వీరిపై జాతి వివక్ష వ్యాఖ్యలు మొదలయ్యాయి.
England vs India: భారత జట్టుకు జరిమానా.. కారణం అదే!!
మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ అభిమానుల అల్లరి శృతి మించింది. స్టేడియం నుంచి బయటికి వెళ్లే దారిలో ఇటలీ అభిమానులపై పిడిగుద్దులు కురిపించారు. వారి జాతీయ పతాకాన్ని అవమానపరిచారు. అలాగే నల్ల జాతీయులు కనిపించినా వదల్లేదు. ఇక వీధుల్లో వీరంగానికి అంతే లేకుండా పోయింది. కొందరు రాళ్లు విసరడంతో పలు బిల్డింగ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘర్షణలో అటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఫ్యాన్స్ అరాచకానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంగ్లండ్ అభిమానుల తీరుపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆటగాళ్లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేస్తూ దూషణకు దిగడాన్ని సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అడ్డుకోవడంలో విఫలమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అసభ్యరమైన పోస్ట్లు ఎప్పటికప్పుడూ తొలగించడం, సదరు ఖాతాలను బ్లాక్ చేయడంలో ఈ టెక్ కంపెనీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ వివక్ష వ్యాఖ్యల నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం సైతం ఫెస్బుక్, ట్విటర్, ఇన్స్టాలపై కన్నెర్ర చేసింది. సోషల్ మీడియా కంపెనీలకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరోవైపు అసభ్యకర పోస్ట్లను ఎప్పటికప్పుడూ తొలిగిస్తున్నామని ట్విటర్, ఫేస్బుక్ ప్రకటించాయి.