మంచినీరు మాత్రమే తాగండి:
యూఈఎఫ్ఏ యూరోకప్ 2020లో భాగంగా క్రిస్టియానో రొనాల్డో జట్టు కెప్టెన్ హోదాలో కోచ్ ఫెర్నాండో సాంటోస్తో కలిసి మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. అయితే తాను కుర్చీలో కూర్చునేటప్పుడు టేబుల్పై రెండు కోకకోలా బాటిల్స్ కనిపించాయి. వెంటనే వాటిని చేతిలోకి తీసుకొని పక్కన పెట్టేసి.. 'ఇలాంటివి వద్దు. మంచినీరు మాత్రమే తాగండి' అంటూ వాటర్ బాటిల్ను తన చేతిలో తీసుకొని చెప్పాడు. దీంతో కోచ్ ఫెర్నాండోస్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. రొనాల్డో ఏం చేస్తున్నాడో అతడికి అర్థం కాలేదు. కానీ తర్వాత తన మాటలతో అర్థం చేసుకున్న అతను రొనాల్డొను ప్రశంసించాడు.
29 వేల కోట్లు బొక్క:
రొనాల్డో దెబ్బకి కోకాకోలా స్టాక్ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకాకోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు (మన కరెన్సీలో 29 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లినట్లయ్యింది. రొనాల్డో వ్యవహరించిన తీరుపై యూరో ఛాంపియన్షిప్ స్పానర్షిప్గా వ్యవహరిస్తున్న కోకాకోలా స్పందించింది. ఎవరికి నచ్చిన డ్రింక్లు వాళ్లు తాగుతారు అని బదులిచ్చింది. ఇప్పుడు ఏ డ్రింక్ల పట్ల అయితే రొనాల్డో అయిష్టత కనబరిచాడో.. కొన్నేళ్ల క్రితం అదే సాఫ్ట్ డ్రింక్ కంపెనీకి ఒక యాడ్ చేశాడు. 2006లో 22 ఏళ్ల రొనాల్డో కోకాకోలా బ్రాండ్కు యాడ్ చేశాడు.
రొనాల్డో ఆధ్వర్యంలోనే:
యూరోకప్ 2020లో భాగంగా పోర్చుగల్ గ్రూఫ్ 'ఎఫ్'లో ఉంది. పోర్చుగల్తో పాటు జర్మనీ, ప్రాన్స్, హంగేరీ కూడా ఉండడంతో మ్యాచులు రసవత్తరంగా సాగనున్నాయి. దీంతో అందరూ ఈ గ్రూఫ్ను 'గ్రూఫ్ ఆఫ్ డెత్'గా అభివర్ణిస్తున్నారు. 2016లో జరిగిన యూరోకప్లో క్రిస్టియానో రొనాల్డో ఆధ్వర్యంలోనే పోర్చుగల్ జట్టు ఫ్రాన్స్ను ఫైనల్లో ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న పోర్చుగల్ మరోసారి చాంపియన్గా నిలవాలని చూస్తుంది.
మరో ఏడు గోల్స్ చేస్తే:
36 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డోకిది వరుసగా ఆరో యూరో చాంపియన్షిప్ కావడం విశేషం. కాగా రొనాల్డో అంతర్జాతీయ మ్యాచ్ల్లో పోర్చుగల్ తరపున ఇప్పటివరకు 104 గోల్స్ చేశాడు. మరో ఏడు గోల్స్ చేస్తే.. అంతర్జాతీయ ఫుట్బాల్లో ఒక దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇరాన్ మాజీ ప్లేయర్ అలీ దాయి (109 గోల్స్) పేరిట ఉంది. ఫుట్బాల్ చరిత్రలో (జాతీయ జట్టు, క్లబ్ల తరఫున) అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో రొనాల్డో రెండో స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే (757)ను ఇప్పటికే అధిగమించాడు.
25 కోట్ల ఫాలోవర్లు:
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో 25 కోట్ల (250 మిలియన్లు) ఫాలోవర్లను సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా క్రిస్టియానో రొనాల్డో ఇప్పటికే రికార్డు సృష్టించాడు. ప్రీమియర్ లీగ్లోని 20 క్లబ్లకు చెందిన అభిమానుల సంఖ్య 15 కోట్లు. అయితే ఒక్క జువెంటస్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డోనే అంతకు మించి ఫాలోవర్లను కలిగి ఉండటం విశేషం. ఫేస్బుక్, ట్విట్టర్ అభిమానుల సంఖ్యల్లోనూ రొనాల్డో దరిదాపుల్లో మరెవరులేరు. అమెరికాకు చెందిన పాప్ స్టార్ అరియానా గ్రాండే (214 మిలియన్లు), హాలీవుడ్ నటుడు 'ది రాక్' డ్వైన్ జాన్సన్ (209 మిలియన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.