కరోనా వల్ల ఆతిథ్యం ఇవ్వలేమని
ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబరులో చైనాలోని హాంగ్జౌలో జరగాల్సిన ఒలింపిక్ తర్వాత రెండో అతి పెద్ద టోర్నీ అయిన ఆసియా క్రీడల నిర్వహణను చైనా ఇటీవల వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల మొదట్లో ఆసియా గేమ్స్ ను 2023కు వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తాజాగా శనివారం ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ (AFC)కు ఫుట్ బాల్ ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వబోమని తెలియజెప్పింది. వచ్చే ఏడాది జూన్, జూలైలో 10నగరాల్లో ఆసియా కప్ ఫుట్ బాల్ మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో 24జట్లు పోటీ పడతాయి. అందులో ఇండియా కూడా ఒకటి. కానీ కరోనా నేపథ్యంలో ఈ టోర్నీని తాము నిర్వహించలేమని చైనా ఫుట్బాల్ అధికారులు AFCకి లేఖ ద్వారా తెలియజేశారు. అయితే ఇక ఆసియా కప్ నిర్వహణకు సంబంధించి ఏ దేశం ఆతిథ్య బాధ్యతలు తీసుకుంటుందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్థాన్, శ్రీలంక ఆర్థిక పరిస్థితుల వల్ల ఆసియాకప్ నిర్వహించే పరిస్థితి లేదు. ఇక ఇండియా లేదా ఇండోనేషియా మాత్రమే ఈ ఆసియా కప్ ఆతిథ్యానికి మొగ్గుచూపే అవకాశం ఉంది.
అసాధారణ పరిస్థితుల వల్ల ఆతిథ్య హక్కులు వదులుకుంది
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితులను గుర్తించడం కారణంగా.. చైనా తన ఆతిథ్య హక్కులను వదులుకుంది అని ఏఎఫ్సీ పాలకమండలి ఒక ప్రకటనలో తెలిపింది. టోర్నమెంట్ నిర్వహణలో ప్లేయర్లు, నిర్వాహకుల సమిష్టి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొంది. ఇక ఫుట్ బాల్ ఆసియా కప్ ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతుంది. 2019లో చివరి ఎడిషన్ను ఖతార్ గెలుచుకుంది. చైనా ఆసియా కప్ను నిర్వహించడం ఇది రెండోసారి. వారు 2004లో ఆతిథ్యం ఇచ్చారు, అప్పట్లో ఫైనల్లో జపాన్ చేతిలో 3-1 తేడాతో చైనా ఓడిపోయింది.
తొలుత కరోనా ఎఫెక్ట్ ఆసియా గేమ్స్ మీద..
ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన మెగా టోర్నీ 'ఆసియా గేమ్స్'ను 2023కి వాయిదా వేస్తున్నట్లు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) తాత్కాలిక అధ్యక్షుడు రణధీర్ సింగ్ ఇటీవల ప్రకటించారు. వివిధ రకాల క్రీడలను నిర్వహించే ఈ మెగాటోర్నీ 19వ ఎడిషన్ సెప్టెంబరులో నిర్వహించాలని తొలుత నిర్వాహకులు భావించారు. ఇక సమ్మర్ ఒలింపిక్స్ గేమ్స్ లాంటి టోర్నీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెగా టోర్నీ కాగా.. ఒలింపిక్స్తో పోల్చితే ఆసియా గేమ్స్ రెండో అతిపెద్ద మెగా టోర్నీగా పేర్కొనబడింది. కానీ కరోనా నేపథ్యంలో చైనా ఈ టోర్నీని వాయిదా వేసింది.