ఐదు రీజియన్లుగా జట్ల వర్గీకరణ
ఎఎఫ్సి కప్ టోర్నీ నిర్వాహకులు టీమ్ లను ఐదు రీజియన్లుగా వర్గీకరించారు. దీనిప్రకారం బెంగళూరు ఎఫ్ సి జట్టు.. దక్షిణ రీజియన్ జట్లు మాజియా ఎస్ అండ్ ఆర్ (మాల్దీవులు), అల్బానీ ఢాకా లిమిటెడ్ (బంగ్లాదేశ్), మొహున్ బగన్, కొలంబో ఎఫ్ సి (శ్రీలంక), థింపూ సిటీ (భూటాన్), క్లబ్ వాలెంసియా (మాల్దీవులు)లతో కలిసి టోర్నీ ప్రిలిమినరీ స్టేజ్ మ్యాచ్ల్లో పాల్గొంటుంది. ఆసియా ఖండ దేశాల్లో ఫుట్బాల్ ఆటను ప్రగతిపథంలో పరుగులు పెట్టించేందుకే ఆసియా ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సి) టోర్నీ నిర్వహిస్తోంది. దీంతోపాటు ఆసియా ఖండంలోనే టాప్ టైర్ క్లబ్ టోర్నమెంట్ ఎఎఫ్ సి చాంపియన్స్ లీగ్ (ఎసిఎల్) టోర్నీ కానున్నది.
ఐ - లీగ్ నుంచి డెంపో కూడా ఔట్
పనాజీ: ఐదుసార్లు ఐ - లీగ్ చాంపియన్స్ డెంపో ఎస్సీ యాజమాన్యం టోర్నీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించింది. అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్)కు సరైన దిశ లేదని ఆరోపించింది. భారత్లో ఫుట్బాల్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్న ఎఐఎఫ్ఎఫ్ అభిప్రాయంతో విభేదిస్తూ ఐ - లీగ్ నుంచి డెంపో ఎస్ సి క్లబ్ వైదొలిగింది. ఇప్పటికే గోవాకు చెందిన రెండు ప్రసిద్ధి చెందిన క్లబ్లు సాల్గావోకర్ ఎఫ్ సి, స్పోర్టింగ్ క్లబ్ డి గోవా యాజమాన్యాలు ఐ - లీగ్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయి.
అగ్రశ్రేణి టోర్నీ లీగ్గా ఐఎస్ఎల్
భారత్ ఫుట్బాల్లో అగ్రశ్రేణి టోర్నీ లీగ్గా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)ను ఖరారుచేసి, ఐ-లీగ్ లేదా లీగ్ వన్ రెండో లీగ్గా నిర్ణయిస్తూ ఎఐఎఫ్ఎఫ్ తీసుకున్న నిర్ణయాన్ని గోవాలోని మూడు క్లబ్ల యాజమానులు శివానంద్ సాల్గావోకర్, శ్రీనివాస్ డెంపో, పీటర్ వాజ్ ఉమ్మడిగా వ్యతిరేకించారు. ఈ మేరకు జూన్ 23నే ఉమ్మడి నిర్ణయం ప్రకటించారు. ఐ - లీగ్ లో ప్రవేశానికి జట్ల యాజమాన్యాలు బిడ్లు దాఖలుచేసేందుకు బుధవారంతో గడువు ముగిసింది. తాము కూడా ఐ - లీగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ఎఐఎఫ్ఎఫ్కు డెంపో క్లబ్ యాజమాన్యం లేఖ రాసింది.
ఐ-లీగ్ నుంచి వైదొలిగే యోచనలో కంపెనీలు
‘టీం నిర్వహణతోపాటు లీగ్ బరిలో నిలిచేందుకు భారీగా ఖర్చుచేస్తున్న నేపథ్యంలో ఐ-లీగ్ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి కారణంగానూ, టోర్నీ పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచన కారణంగానూ ఈ లీగ్ నుంచి వైదొలగాలని డెంపో గ్రూప్ కంపెనీలు, క్లబ్ యాజమాన్యం నిర్ణయించాయి. సదరు టోర్నీకి అంత సామర్థ్యం లేకపోవడంతో ఐ - లీగ్లో అదనపు పెట్టుబడులు పెట్టనవసరం లేదని నిర్ణయించాం. ఐ - లీగ్ నుంచి వైదొలుగుతున్నందుకు విచారం వ్యక్తంచేస్తున్నాం. వచ్చే ఏడాదిలో జరిగే ఐ - లీగ్ టోర్నీలో భాగస్వామి కాలేకపోతున్నాం' అని ఆ లేఖలో పేర్కొన్నది. ఇక ముందు ఐ - లీగ్లో గానీ, ఎఐఎఫ్ఎఫ్ నిర్వహించే టోర్నీల్లో గానీ పాల్గొనబోమని ప్రకటించింది.