
హైదరాబాద్: భారత జట్టుకు కోచ్గా వ్యవహరిస్తోన్న స్టీఫెన్ కాన్స్టన్టినె పదవీ కాలం పూర్తి కావొచ్చింది. దీంతో అతనినే మళ్లీ కోచ్గా కొనసాగాలంటూ అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) పిలుపునిచ్చింది. బుధవారం ముంబై వేదికగా జరిగిన సమావేశంలో స్టీఫెన్నే జాతీయ ఫుట్బాల్ కోచ్గా ఉంచాలంటూ ఏఐఎఫ్ఎఫ్ టెక్నికల్ కమిటీ నిర్ణయాన్ని విడుదల చేసింది.
రెండు దఫాలుగా జరిగిన ఈ నిర్ణయంలో స్టీఫెన్ తగినవాడంటూ ఏఐఎఫ్ఎఫ్ పేర్కొంది. దీంతో ఒప్పందం పొడిగించాలంటే అతను వేతనం పెంచాలని డిమాండు చేశాడు. సమాఖ్య దానికి సైతం ఒప్పుకుంది. ప్రస్తుతం అతను నెలకు రూ.12.8లక్షలు తీసుకుంటున్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ర్యాంకింగ్కు ప్రామాణికంగా భావించే ఫిఫా ర్యాంకింగ్స్లో భారత జట్టు అభివృద్ధి కనపరచడమే ఇందుకు కారణం. 2015 నుంచి భారత జట్టుకు కోచ్గా విధులు నిర్వహిస్తున్న ఈ విదేశీ కోచ్ యావత్ భారతదేశంలోనే అత్యధిక జీతం పొందుతున్న విదేశీ కోచ్. ఫిఫా ర్యాంకింగ్ లో టాప్ 100లో చేరిందంటే భారత్ మెరుగైన స్థాయిలో రాణిస్తుందనే చెప్పాలి.
ఇప్పటికే స్టీఫెన్కు మరో రెండు దేశాల నుంచి ఆఫర్లు వస్తున్నాయనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అతని ఒప్పందాన్ని పొడిగించే ప్రక్రియను అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య వేగవంతం చేసింది. ఈ ఒప్పందంతో అతను 2019 సీజన్ వరకు భారత్ జట్టుకే పనిచేయనున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.