మార్గావ్ (గోవా): ఇండియన్ సూపర్లీగ్ (ఐఎస్ఎల్) ఇక నుంచి ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించనున్నది. గోవాలోని మార్గావ్లో జరిగిన అఖిలభారత ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఐఎస్ఎల్ నిర్వహణకు కొత్త నిబంధనలను ఆమోదించింది. ఇప్పటి వరకు ఆయా ప్రాంఛైసీల క్రీడాకారులకు వేతనాల చెల్లింపుపై విధించిన ఆంక్షలను ఎఐఎఫ్ఎఫ్ తొలగించింది.
ఈ నిబంధనలు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అక్టోబర్లో ప్రారంభమయ్యే ఐఎస్ఎల్ టోర్నీ నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. ఆటగాళ్లందరికి రూ.17.5 కోట్లు చెల్లించొచ్చని పేర్కొంది. ఇప్పటివరకు కెప్టెన్లకు మాత్రమే ఈ వేతనం చెల్లించేవారు.
ఇక నుంచి ఆయా ఫ్రాంచైసీ యాజమాన్యాల ఆర్థిక వనరులను బట్టి జట్టు సారధి (మార్క్యూ ప్లేయర్) వేతనాన్ని ఖర్చు చేసుకొనే వెసులుబాటు లభించింది. మార్క్యూ ప్లేయర్.. కోచ్గా వ్యవహరించే అంశంపైనా ఎఐఎఫ్ఎఫ్ రాయితీనిచ్చింది. దీని ప్రకారం మార్క్యూ ప్లేయర్నే హెడ్ కోచ్గా నియమించుకోవచ్చు.
ఆ తర్వాత మాత్రం సదరు ఫ్రాంచైసీ మరో క్రీడాకారుడ్ని మార్క్యూ ప్లేయర్గా నియమించుకుంటూ ఒప్పందం చేసుకోవాలి.ఇక ఆటగాళ్ల కోసం ఫ్రాంచైసీ యాజమాన్యాలు చేసే ఖర్చు రూ.21 కోట్లకు మాత్రమే పరిమితం చేయాలన్న నిబంధననూ సడలించింది.
ఎఐఎఫ్ఎఫ్ అధికారిక లీగ్ 'ఫుట్సాల్'?
దేశ వ్యాప్తంగా ఫుట్బాల్కు మంచి రోజులు రానున్నాయి. స్వల్ప కాల గడువుతో కూడిన అధికారిక లీగ్ను నిర్వహించాలని ఎఐఎఫ్ఎఫ్ తలపోస్తున్నది. ఈ లీగ్కు ఫుట్సాల్ అని పేరు పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. అంతర్జాతీయంగా ఈ లీగ్కు ప్రాచుర్యం కల్పించాలని భావిస్తున్నది.
2017 మధ్యలో లీగ్ ప్రారంభమవుతుందని ఎఐఎఫ్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఇండేవ్ లాజిస్టిక్స్ చైర్మన్ గ్జావియర్ బ్రిట్టోతోపాటు కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసి 'ప్రీమియర్ ఫుట్సాల్' లీగ్ను ప్రారంభించారు. దీనికి ప్రచారకర్తగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని, అధ్యక్షుడిగా మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు లూయిస్ ఫిగోను నియమించింది. అయితే అధికారిక ఫుట్సాల్ను ఎఐఎఫ్ఎఫ్ ప్రారంభిస్తే.. ప్రీమియర్ ఫుట్సాల్కు గుర్తింపు ఉండదు.
ప్రీమియర్ ఫుట్సాల్ లీగ్లో క్రీడాకారులెవ్వరూ పాల్గొనవద్దని ఎఐఎఫ్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ తెలిపారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఫుట్బాల్ సంఘాలకు లేఖ రాసినట్లు చెప్పారు. ఇక ఎఐఎఫ్ఎఫ్ మాత్రమే పుట్సాల్ సహా అన్ని ఫార్మాట్లలో లీగ్లను అధికారికంగా నిర్వహించే సంస్థ అని స్పష్టంచేశారు.
2007లో నాడు జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్ర ప్రారంభించిన ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసిఎల్)ను నిలువరించి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)ను ప్రారంభించిన బిసిసిఐ మాదిరిగానే ఎఐఎఫ్ఎఫ్ వ్యవహరిస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎఐఎఫ్ఎఫ్ నిర్ణయంపై దాని భాగస్వామి ఐఎంజి - రిలయన్స్ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.