
హైదరాబాద్: భారత జట్టు ప్రస్తుతం ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీల తరపున ఆడుతూ అందరి అంచనాలను అందుకుంటోంది. ఈ క్రమంలో రాబోయే కాలంలో బీసీసీఐ ఇంగ్లాండ్ పర్యటనను నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన గురించి భారత జట్టు మాజీ బౌలర్ జహీర్ ఖాన్ స్పందించాడు.
ఇంగ్లాండ్లో ఐదు టెస్టుల సిరీస్కు ముందు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతుండడంతో అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియాకు దాదాపు నెల సమయం దొరుకుతుందని మాజీ పేసర్ జహీర్ఖాన్ అభిప్రాయపడ్డాడు. జులై 3 నుంచి 17 వరకూ టీమిండియా.. ఇంగ్లాండ్లో ఆ జట్టుతో మూడేసి టీ20లు, వన్డేలు ఆడనుంది. ఆగస్టు 1న టెస్టు సిరీస్ ఆరంభం అవుతుండడంతో టీమిండియాకు చాలినంత సమయం ఉంటుందని ఆయన అన్నారు.
'అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత జట్టుకు చాలా సమయం దొరుకుతుంది. పరిమిత ఓవర్ల సిరీస్ అయ్యే సరికి అక్కడి వాతావరణానికి అలవాటు పడతారు. టీమ్ఇండియాలో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ ఫార్మాట్లలో ఆడుతుండడంతో ఆ సిరీస్తో అక్కడి వికెట్ల గురించి ఓ అవగాహన కలుగుతుంది. ఇంగ్లాండ్లో వాతావరణం స్థిరంగా ఉండదు. స్వింగ్ ఎక్కువగా ఉంటుంది. రోజు చివరికి వచ్చే సరికి బౌలరైనా, బ్యాట్స్మన్ అయినా సరైన ఆలోచన దృక్పథంతో ఆడాలి' అని జహీర్ చెప్పాడు.
'పనిభారాన్ని ఎదుర్కోవాలనేది నిజం. కానీ ఆ విషయంలో చురుగ్గా ఉండాలి. మ్యాచ్ ప్రాక్టీసే ఉత్తమ ప్రాక్టీస్ అని నొక్కిచెబుతున్నా. మంచి లయతో ఉంటే ప్రాక్టీస్ సెషన్ నీ పనిభారాన్ని తగ్గించడంలో ఏ మాత్రం ఉపయోగపడదు' అని జహీర్ పేర్కొన్నాడు.