ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లోకి తీసుకొస్తా..
ఈ సందర్భంగా ఓ అభిమాని అదృశ్యమయ్యే శక్తి ఉంటే ఏం చేస్తావని చహల్ను ప్రశ్నించగా.. వెంటనే రాంచీలో ఉన్న ధోనీ దగ్గర ప్రత్యక్షమవుతానని సమాధానమిచ్చాడు. అలాగే ఇతర క్రికెటర్లలా ధోనీని ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్స్లోకి తీసుకొచ్చే సత్తా తన ఒక్కడికే ఉందన్నాడు. విమాన ప్రయాణాలు మొదలయిన వెంటనే రాంచీకి వెళ్లి.. మహీ ఫ్యాన్స్ కోసం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 24 గంటలు ఓపెన్ చేసి పెడ్తానన్నాడు.
|
ఎలా తప్పించుకుంటాడో చూస్తా..
‘విమాన ప్రయాణాలు పున ప్రారంభం అయిన వెంటనే.. రాంచీకి బయలుదేర్తాను. అక్కడికి వెళ్లి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను 24 గంటలు తెరిచే ఉంచుతా. అప్పుడు ధోనీ ఎలా తప్పించుకుంటాడో చూస్తా.'అని చహల్ పేర్కొన్నాడు. ఇక వికెట్ల వెనుకాల మహీ భాయ్.. తిత్లీ అని పిలిచే పిలుపు తానేంతో మిస్సవుతున్నానన్నాడు. ఈ మేరకు అతనితో దిగిన ఓ ఫొటోను ఈ లెగ్ స్పిన్నర్ ట్వీట్ చేశాడు.
రీ ఎంట్రీపై నీళ్లు చల్లిన కరోనా..
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం మైదానానికి దూరమైన ధోనీ.. ఐపీఎల్తో రీఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. అక్కడ సత్తాచాటి తద్వారా భారత జట్టులోకి రావాలని ఆశించాడు. లాక్డౌన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. నెట్స్లో ఎన్నడూ లేని విధింగా కీపింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కానీ కరోనా పుణ్యమా ఈ క్యాష్ రిచ్ లీగ్ నిరవధికంగా వాయిదా పడటంతో అతని అభిమానుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. అంతేకాకుండా ధోనీ కెరీర్ ముగిసిందనే వాదన తెరపైకి వచ్చింది. కానీ చెన్నై ఆటగాళ్లు మాత్రం ధోనీలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని, ఇంకా రెండు, మూడేళ్లు అలవోకగా ఆడేస్తాడంటున్నారు. అయితే హర్భజన్, నెహ్రా, ఆకాష్ చోప్రా లాంటి మాజీ ఆటగాళ్లు మాత్రం ధోనీ మరోసారి బ్లూ జెర్సీ ధరించే అవకాశం లేదంటున్నారు.