
ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ భగ్గుమంటోంది. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో సోమవారం మొదలైన ఘర్షణలు ఈ రోజుకీ తగ్గుముఖం పట్టలేదు. ఈ హింసాత్మక ఘటనలపై భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరుగుతుండటం దురదృష్టకరమని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేసారు.
'డిల్లీలో హింసాత్మక ఘటనలు జరుగుతుండటం ఎంతో దురదృష్టకరం. రాజధాని ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఢిల్లీలో ఎవరికి గాయమైనా అది గొప్ప భారతదేశ రాజధానికే మాయని మచ్చ అవుతుంది. ప్రతి ఒక్కరూ శాంతి స్థాపనకు కృషి చేయాలి' అని సెహ్వాగ్ కోరాడు.
'ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు బాధాకరం. దయచేసి అందరూ శాంతి, సామరస్యంతో ఉండాలని కోరుతున్నా. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. మనమంతా మనుషులమే. మనమంతా ఇతరుల పట్ల ప్రేమ, గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది' యువీ పేర్కొన్నాడు.
'మన సొంత ప్రజలు ఎందుకు చనిపోతున్నారు. ఎవరికీ బాధ కలిగించవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నా' అని హర్భజన్ ట్వీట్ చేసాడు. ఈశాన్య డిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరింది. ఆందోళనల్లో దాదాపు 200 మంది గాయపడ్డారు. వీరిలో 48 మంది పోలీసులు కూడా ఉన్నారు. ఘర్షణల్లో ఇప్పటికే హెడ్ కానిస్టేబుల్ రతన్లాల్ మృతి చెందగా.. మంగళవారం రాత్రి ఇంటలెజిన్స్ విభాగం కానిస్టేబుల్ అంకిత్ శర్మ మృత్యువాత పడ్డారు.