ముంబై: క్రికెట్ కెరీర్ ఆరంభంలో లాక్డౌన్ పరిస్థితులు ఉంటే తనకు చాలా కష్టమయ్యేదని టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన యువీ.. తాజాగా ఓ ఛానెల్తో ఫోన్లో మాట్లాడాడు. ఏ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నాడు. లాక్డౌన్ వేళ క్రీడాకారులు చాలా రోజులు ఇంట్లోనే కూర్చోవడం మంచిది కాదని యువీ చెప్పాడు. ఆటగాళ్లకు ఇలాంటి సమయం రాదని, ఈ లాక్డౌన్తో స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం దక్కిందన్నాడు.
కెరీర్లో జహీర్ ఖాన్ అత్యుత్తమ క్యాచ్ అదే: సచిన్
'మనమంతా చాలా లక్కీ. మీకూ, నాకూ 3 లేదా 4 గదులున్నాయి. బయట ఎంతో మంది పెద్ద కుటుంబంతో ఒకే గదిలో ఉంటున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతుంటారు. కానీ.. ఏం చేయలేని పరిస్థితి. అందరూ మే 3 వరకు ఓపిక పట్టాల్సిందే. ప్రస్తుతం నేనున్న ప్రదేశానికి అలవాటు పడ్డా. ఎందుకంటే.. క్రికెట్ ఆడే రోజుల్లో చాలా క్యాంపులకు వెళుతుండేవాడిని కాబట్టి ఇప్పుడది అలవాటైంది' అని యువరాజ్ అన్నాడు.
'ఈ లాక్డౌన్కు ముందు క్రీడాకారులు ఇంటివద్ద ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడంతా సన్నిహితులతో ఉంటున్నారు. అయితే అథ్లెట్లు చాలా రోజులు ఇంటి పట్టునే ఉండడం అంత మంచిది కాదు' అని యువీ పేర్కొన్నాడు. అలాగే తన కెరీర్ తొలినాళ్లల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తనకు ఇబ్బందిగా ఉండేదని మాజీ బ్యాట్స్మన్ చెప్పాడు. 'మాకెప్పుడూ ఇలాంటి ఆఫ్ సీజన్ లేదు. ఏడాదిలో 10-11 నెలల పాటు క్రికెట్ ఆడుతుండే వాళ్లం. మిగతా సమయం ప్రయాణాలకే సరిపోయేది. అదృష్టం కొద్దీ నేనిప్పుడు రిటైరయ్యాను. కెరీర్ ఆరంభంలో ఇలాంటి లాక్డౌన్ ఉండుంటే నాకు కష్టమయ్యేది. ఎందుకంటే అప్పట్లో నేను బయటే క్రికెట్ ఆడుతుండే వాడిని' అని యువీ చెప్పుకొచ్చాడు.
మాజీ కెప్టెన్ ఎంఎస్ధోనీకి ఇష్టమైన ఆటగాడు సురేశ్ రైనా అని ఈ మాజీ ఆల్రౌండర్ అభిప్రాయపడ్డాడు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో తనతో పాటు రైనా, యూసుఫ్ పఠాన్ ఫామ్లో ఉండటంతో తుది జట్టు ఎంపికలో మహీ తర్జనభర్జన పడ్డాడని యువీ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు. 'రైనాకు ధోనీ అండదండలు పూర్తిగా ఉండేవి. ప్రపంచకప్ జట్టులో నాతోపాటు రైనా, యూసుఫ్ పఠాన్ కూడా ఎంపికయ్యారు. తుది జట్టు ఎంపికలో మహీ సందిగ్ధంలో పడ్డాడు. ఎడంచేతి వాటం స్పిన్నర్లు లేకపోవడం, బంతితోనూ నేను రాణించడంతో నన్ను తుది జట్టులో ఆడించడం అనివార్యమైంది. రైనా ఫామ్లో లేకున్నా ధోనీ అతడికి చాలా అవకాశాలు ఇచ్చాడు' అని యువీ అన్నాడు.