ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో టీమిండియా విఫలం కావడానికి సరైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లేకపోవడం ఒక ప్రధాన కారణమని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పాడు. 'టీమిండియా 2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు, అప్పటి జట్టులో మేమందరం ఒక ఫిక్స్డ్ బ్యాటింగ్ పొజిషన్ కలిగి ఉన్నాం' అని పేర్కొన్నాడు. 2011 ప్రపంచకప్ టోర్నీలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'ను యువరాజ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అలాగే 2019ప్రపంచ కప్లో టీమిండియా మిడిలార్డర్ను అప్పటి జట్టు సరిగ్గా ప్లాన్ చేయలేదని యువరాజ్ అభిప్రాయపడ్డాడు.
తరచూ జట్టులో మార్పులు చేయడం 2019 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియాకు అచ్చిరాలేదని యువరాజ్ తెలిపాడు. 'కేవలం అయిదారు వన్డేలు ఆడిన విజయ్ శంకర్ను 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే ప్లేయర్గా భావించారు. అతను ఇంజూర్ అయ్యాక అతని స్థానంలో నాలుగు వన్డేలే ఆడిన రిషబ్ పంత్తో ఆ స్థానాన్ని భర్తీ చేశారు. ఆ టైంలో అనుభవమున్న అంబటి రాయడును మిడిలార్డర్లో ఆడించాల్సింది. 2003ప్రపంచకప్ జట్టులో నేను ఆడినప్పుడు.. నాతో పాటు మహమ్మద్ కైఫ్, దినేష్ మోంగియా అప్పటికే 50 వన్డేలు ఆడి కొంత అనుభవాన్ని గడించాము.' అని యువరాజ్ టీమిండియా మిడిలార్డర్ ఇష్యూను ప్రస్తావించాడు. ఇక టీ20 క్రికెట్లో కూడా టీమిండియాకు మిడిలార్డర్ సమస్య ఉందని పేర్కొన్నాడు. గత టీ20 ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్లకు సరైన బ్యాటింగ్ స్థానాలు లేకపోవడమే.. టీమిండియా విఫలానికి కారణమని అభివర్ణించాడు.
హోమ్ ఆఫ్ హీరోస్ షోలో యువరాజ్ మాట్లాడుతూ.. భవిష్యత్తు క్రికెట్ అంతా టీ20, టీ10 క్రికెట్దేనని తెలిపాడు. 'టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది. ప్రజలు టీ20 క్రికెటే చూడాలనుకుంటున్నారు, టీ20 క్రికెటే ఆడాలని కోరుకుంటున్నారని యువరాజ్ తెలిపాడు. టీ20 ఫార్మాట్లో ఆడటం వల్ల వచ్చే డబ్బుల వల్ల ప్లేయర్లు వారి ఆటలో ప్రాధాన్యాలపై ఆలోచిస్తున్నారు. ఒక్కరోజు టీ20 ఆడితే రూ.50లక్షలు వస్తున్నప్పుడు ఎవరైనా ఐదు రోజుల క్రికెట్ ఆడి 5లక్షల రూపాయలు ఎందుకు తీసుకోవాలనుకుంటారు. ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రాని ప్లేయర్లు సైతం ఒక్క సీజన్ కోసం రూ.7 నుంచి రూ.10కోట్ల వరకు తీసుకుంటున్నారు' అని యువరాజ్ వివరించాడు. ఇక వన్డే క్రికెట్కు కూడా ఆదరణ తగ్గుతోందన్నారు. టీ20 మ్యాచ్లు చూసి చూసి 50ఓవర్ల మ్యాచ్ చూస్తే టెస్ట్ మ్యాచ్లా అనిపిస్తోంది. కాబట్టి కచ్చితంగా టీ20లదే క్రికెట్ భవిష్యత్తు అని పేర్కొన్నాడు.