న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్టార్ పేసర్, కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ ప్యాట్ కమిన్స్పై టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఆసీస్ స్టార్ పేసర్ను చూసి యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2020 సీజన్కు సంబంధించిన వేలంలో కమిన్స్ రూ. 15.5 కోట్లకు అమ్ముడుపోవడంతో అతను ఫేవరేట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు.
అయితే ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో కమిన్స్ తీవ్రంగా నిరాశపరిచాడు. లయ తప్పిన బౌలింగ్తో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. రోహిత్ శర్మకు పదే పదే షార్ట్ పిచ్ బంతులు వేస్తూ మూల్యం చెల్లించుకున్నాడు. బ్యాటింగ్లో మెరిసినా ఫలితం లేకపోయింది. ఈ చెత్త ప్రదర్శనపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
అయితే శనివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కమిన్స్ కట్టుదిట్టంగా బంతులు వేశాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. కీలక సమయంలో హైదరాబాద్ ఓపెనర్ బెయిర్స్టోను ఔట్ చేసి ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. క్వారంటైన్ కారణంగా ప్రాక్టీస్ లేకనే గత మ్యాచ్లో విఫలమయ్యానని తన ప్రదర్శనతో అభిమానులకకు సమాధానం చెప్పాడు. ఆఫ్ స్టంప్, ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ మీదుగా గుడ్ లైన్ అండ్ లెంగ్త్తో సన్రైజర్స్ బ్యాట్స్మెన్ను టార్గెట్ చేసిన ఫలితం రాబట్టాడు.
Great come back by @patcummins30 ! I think great learning for young fast bowlers after getting hit in first game how quickly he has corrected his lengths and created pressure on srh batsman ! Hallmark of a quality bowler
— Yuvraj Singh (@YUVSTRONG12) September 26, 2020
కమిన్స్ కట్టడికి ముగ్దుడైన యువరాజ్ అతన్ని చూసి యువబౌలర్లు నేర్చుకోవాలని ట్విటర్ వేదికగా సూచించాడు. 'కమిన్స్ తిరిగి లయ అందుకున్న తీరు అద్భుతం. తొలి మ్యాచ్లో విఫలమైనా.. తర్వాతి మ్యాచ్లో తన నాణ్యమైన బంతులతో హైదరాబాద్ జట్టును ఇబ్బంది పెట్టాడు. చాలా మంది యువబౌలర్లు తొలినాళ్లలో ఇబ్బంది పడి తీవ్ర నిరాశకు గురవుతుంటారు. అలాంటి వాళ్లు బంతితో తిరిగి ఎలా రాణించవచ్చో కమిన్స్ను చూసి నేర్చుకోవాలి' అని యువీ ట్వీట్ చేశాడు.
కేకేఆర్లో కమిన్స్కు తోడుగా మిగతా బౌలర్లు కూడా రాణించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మనీశ్ పాండే (38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) అర్ధ సెంచరీ నమోదు చేయగా, డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 36 ), వృద్ధిమాన్ సాహా (31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ 30) మోస్తరుగా ఆడారు.
అనంతరం కోల్కతా 18 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శుబ్మన్ గిల్ (62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు 70 నాటౌట్), మోర్గాన్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 70 బంతుల్లో 92 పరుగులు జోడించారు.
సాహా బంతులన్నీ స్వాహా.. శుభ్మన్ ఫిఫ్టీతో సచిన్ ఇంట సంతోషం.. నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్