హైదరాబాద్: ప్రస్తుతం కోహ్లీసేన సఫారీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ముక్కోణపు టీ20 సిరిస్ ఆడనుంది. హీరో నిదాహాస్ ట్రోఫీ పేరిట జరిగే ఈ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు పాల్గొంటాయి.
మార్చి 6 నుంచి 18 వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగే హీరో నిదాహాస్ ట్రోఫీ 2018 సిరీస్ను యప్ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. సిరీస్ ప్రారంభ మ్యాచ్లో భారత్ జట్టు శ్రీలంకతో తలపడనుంది. మార్చి 18న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈ సందర్భంగా ఈ టీ20 సిరిస్ హక్కులను దక్కించుకున్న నిర్వాహకులు మాట్లాడుతూ యప్ టీవీ అమెరికా, కెనడా, మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, యూకే, యూరప్లలో ఈ సిరీస్ మ్యాచ్లు ప్రసారమవుతాయని తెలిపారు.
శ్రీలంకకు స్వాతంత్యం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ టోర్నీని నిర్వహిస్తోంది. ఈ టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిన జరగనుంది. ఈ టోర్నీ ప్రసార హక్కులను పొందినందుకు చాలా సంతోషిస్తున్నామని యప్ టీవీ ఫౌండర్, సీఈఓ ఉదయ్ రెడ్డి తెలిపారు.
ఈ టోర్నీని యప్టీవీ.కామ్ లేదా, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ బ్లూ రే ప్లేయర్స్, స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్స్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్ల ద్వారా ఈ టోర్నీని వీక్షించవచ్చని తెలిపారు. దక్షిణాసియాకు చెందిన యప్ టీవీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత టీవీ ఆన్ డిమాండ్ సర్వీస్ ప్రొవైడర్.
ఇందులో 300కు పైగా టీవీ ఛానెల్స్, ఐదు వేలకు పైగా సినిమాలు, వందకు పైగా టీవీ షోలను 14 భాషల్లో వీక్షించొచ్చు. ఇటీవలే యప్ టీవీలో ఎమర్లాడ్ మీడియా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. యప్ టీవీలో ప్రస్తుతం 25000 గంటల పాటు వీక్షించే కంటెంట్ని కలిగి ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.