టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి పాకిస్థాన్ జట్టు ఇప్పటికే నిష్క్రమించినా.. ఆ జట్టుకు సంబంధించిన వివాదాలు మాత్రం వదలడం లేదు. శ్రీలంకలో జరుగుతున్న ఈ టోర్నీ సందర్భంగా పాకిస్థాన్కు చెందిన ఓ క్రికెటర్ హోటల్ మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు రావడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో సంచలనం రేపుతోంది.
అసలేం జరిగిందంటే?
సూపర్-8 దశలో పాకిస్థాన్ తన చివరి మ్యాచ్ను ఆతిథ్య శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. అంతకుముందు ఈ ఘటన జరిగింది. కాండీలోని గోల్డెన్ క్రౌన్ హోటల్లో బస చేసిన పాక్ జట్టులోని ఒక ఆటగాడు, హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు గట్టిగా అరిచి సహాయం కోరడంతో తోటి హోటల్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు.

మేనేజర్ క్షమాపణలు.. జరిమానా
ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం సీరియస్గా తీసుకుని పాకిస్థాన్ టీమ్ మేనేజర్ నవైద్ చీమాకు ఫిర్యాదు చేసింది. హోటల్ మేనేజ్మెంట్ ఆ ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా.. నవైద్ చీమా పాక్ జట్టు తరపున క్షమాపణలు చెప్పారు. అనంతరం సదరు క్రికెటర్కు భారీ జరిమానా విధించి విషయాన్ని సద్దుమణిగేలా చేశారు.
క్రమశిక్షణ కమిటీ ముందుకు ఆ క్రికెటర్!
సదరు ఆటగాడి పేరును మేనేజ్మెంట్ ఇంకా గోప్యంగా ఉంచినప్పటికీ.. అతను త్వరలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరుకావాల్సి ఉంటుందని సమాచారం. బోర్డు అతనిపై మరింత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సూపర్-8లో శ్రీలంకపై పాక్ విజయం సాధించినప్పటికీ, నెట్ రన్రేట్ తక్కువగా ఉండటంతో సెమీస్ చేరకుండానే ఆ జట్టు ఇంటిదారి పట్టింది.
పాక్ క్రికెటర్ల పాత చరిత్ర
పాకిస్థాన్ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది విదేశీ పర్యటనల్లో ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో యువ బ్యాటర్ హైదర్ అలీ ఇంగ్లాండ్ పర్యటనలో లైంగిక దాడి ఆరోపణలతో అరెస్టయ్యారు (తగిన ఆధారాలు లేక విడుదలయ్యారు). కొన్నేళ్ల క్రితం మలేషియా పర్యటనలో పాక్ టీమ్ మసాజ్ నిపుణుడు మలాంగ్ అలీ కూడా మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించి జరిమానా ఎదుర్కొన్నారు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇలాంటి పనులకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.