తొలి గేమ్లో 3-11తో వెనకబడిన సైనా
ఒకానొక దశలో సైనా నెహ్వాల్ తొలి గేమ్లో 3-11తో వెనకబడి ఉంది. ఆ సమయంలో సైనా ఆటతీరుపై కోచ్ స్థానంలో కూర్చున్న ఆమె భర్త కశ్యప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘నువ్వు మ్యాచ్ గెలవాలి అనుకుంటే క్రమశిక్షణతో ఆడాలి అని అర్థం చేసుకో. ఓయ్.. నువ్వు చెత్త షాట్స్ ఆడుతున్నావ్.. మ్యాచ్ గెలవాలని ఉంటే పరిస్థితి అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా ఆడు" అని మ్యాచ్ బ్రేక్ టైంలో సైనాను మందలించాడు.
వ్యూహాలకు పదును పెట్టిన సైనా
ఆ తర్వాత తన వ్యూహాలకు పదును పెట్టిన సైనా ప్రత్యర్థిని కోర్టులో పరిగెట్టేలా చేసి 12-14తో స్కోరు అంతరాన్ని తగ్గించింది. అయితే తిరిగి పుంజుకున్న తై జు క్రమంగా పాయింట్లు సాధించి 21-15తో తొలి గేమ్ను సొంతం చేసుకుంది. ఇక తొలి గేమ్ అనంతరం మరోసారి కశ్యప్ మరోసారి సైనాకు సలహాలిచ్చాడు.
పదేపదే తప్పు చేస్తున్నావ్
"ఆచితూచి షాట్స్ ఆడు. షటిల్ను నియంత్రణలో ఉంచుకుంటూ షాట్లు ఆడు. అనవసర షాట్స్ ఆడుతూ పదేపదే తప్పు చేస్తున్నావ్. డ్రాప్ షాట్లు ఆడుతూ కోర్టులో చాలా ప్రదేశాన్ని ప్రత్యర్థికి వదిలేస్తున్నావ్. తై జు చేతిలోకి షాట్లు కొట్టకు. క్రమశిక్షణతో ఆడు. ఆమెను స్ట్రోక్స్ ఆడేలా ప్రేరేపించు. దాంతో పాయింట్లు సాధించడానికి నీకు అవకాశం దొరుకుతుంది. ఆమె ఆడుతున్న తీరును చూడు. లేకుంటే మ్యాచ్ చేజారుతుంది" అని సలహా ఇచ్చాడు.
రెండో గేమ్లో పోరాడిన సైనా
అయితే, రెండో గేమ్లో పోరాడిన సైనా 19-21తో ఓడింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సైనా 15-21, 19-21తో ఓటమి చవిచూసింది. ఇక, బ్యాడ్మింటన్ ప్రేమ జంట కశ్యప్, సైనా గతేడాది డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకూ ఇద్దరు భారత షట్లర్లు మాత్రమే టైటిల్ని గెలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొణె విజేతగా నిలవగా.. 2001లో పుల్లెల గోపీచంద్ టైటిల్ సాధించారు. అప్పటి నుంచి టైటిల్ కోసం భారత్ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.