బాల్ ట్యాంపరింగ్
ఈ ఘటన యావత్ క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపోయాలా చేసింది. ప్రపంచ క్రికెట్ ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లను దోషులుగా నిలబెట్టింది. క్రీడాస్పూర్తిని దెబ్బతీసిన ఈ వ్యవహారంతో ఆ ఆటగాళ్లు తమ ఇష్టమైన ఆటకే దూరమయ్యేలా చేసింది. చివరకు తాము చేసింది ఘోర తప్పిదమని మీడియా ముందు కన్నీళ్లతో పశ్చాతాపం వ్యక్తం చేసేలా చేసింది. సఫారీ పర్యటనలో భాగంగా కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో కామెరాన్ బాన్క్రాఫ్ట్, వైస్ కెప్టెన్ డెవిడ్ వార్నర్ సూచనల మేరకు సాండ్ పేపర్తో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడు. ఈ ఘటనకు అప్పటి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ వత్తాసు పలకడం పెను వివాదమైంది. టీవీ కెమెరాల్లో రికార్డైన ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆసీస్ ఆటగాళ్ల బండారం బయట పడింది. ఈ ఘటనతో కెప్టెన్ స్టీవ్స్మిత్, వైస్ కెప్టెన్ డెవిడ్ వార్నర్లపై ఏడాది నిషేధం పడగా.. యువ ఆటగాడు బాన్క్రాఫ్ట్ను 9 నెలలు ఆటకు దూరం చేసింది.
మహ్మద్ షమీపై లైంగిక ఆరోపణలు
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ స్త్రీలోలుడని అతని భార్య హసీన్ జహాన్ చేసిన సంచలన ఆరోపణలు అతడి కెరీర్ను ప్రశ్నార్థకంలో పడేశాయి. అతను పలువురి అమ్మాయిలతో అక్రమ సంబంధాలు కొనసాగించాడని, మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని మీడియా ముందే హసీన్ జహాన్ బహిరంగంగా ప్రకటించింది. దీంతో అతడికి బీసీసీఐ కాంట్రాక్టు కూడా ఇవ్వలేదు. హసీన్ జహాన్ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ షమీ ఎలాంటి తప్పిదం చేయలేదని క్లీన్చీట్ ఇచ్చింది. దీంతో తిరిగి షమీ బీసీసీఐ కాంట్రాక్టును దక్కించుకోవడం జరిగింది. 2014లో జహాన్ను షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం షమీకి దూరంగా ఉంటున్న జహాన్ తన కుమార్తె పోషణ కోసం భరణం చెల్లించాలని కోర్టులో షమీపై కేసు కూడా పెట్టింది.
నాగిని డ్యాన్స్ వివాదం..
నిదాహాస్ ముక్కోణపు టోర్నీలో బంగ్లాదేశ్ క్రికెట్ ప్లేయర్లు చేసిన నాగిని డ్యాన్స్ అప్పట్లో వివాదం అయింది. శ్రీలకం-బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలో గెలిచినప్పుడు నాగిని డ్యాన్స్, వికెట్ తీసినప్పుడు నాదస్వరం ఊదినట్లు హావభావాలు వ్యక్తపరచడం అభిమానులను ఆకట్టుకుంది. కానీ ఇది చివరకు పెద్ద వివాదానికి దారి తీసింది. టోర్నీలో భాగంగా బంగ్లా-శ్రీలంక మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో షార్ట్ పిచ్ బంతుల వివాదం చోటు చేసుకుంది. చివరి ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 12 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తే, ఆ జట్టు పైనల్కు వెళుతుంది. చివరి ఓవర్ తొలి బంతి భుజం కంటే ఎత్తులో వెళ్లినా ‘నో బాల్' ఇవ్వలేదేమని మహ్ముదుల్లా అంపైర్లను అడిగాడు.
మరోవైపు ఇదే తరహాలో వచ్చిన రెండో బంతిని పుల్ చేయలేకపోయిన ముస్తఫిజుర్ పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన బంగ్లాదేశ్ సబ్స్టిట్యూట్ ఆటగాడు నురుల్ శ్రీలంక కెప్టెన్ తిసారా పెరిరాతో వాగ్వాదానికి దిగాడు. దీంతో అంపైర్లు కలగజేసుకుని సర్ది చెప్పారు. అదే సమయంలో కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ సహా బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా బౌండరీ దగ్గరకు వచ్చారు. షకీబ్ అంపైర్లతోనూ వాగ్వాదానికి దిగాడు. మైదానం వీడి వచ్చేయాల్సిందిగా తమ బ్యాట్స్మెన్ను పదేపదే ఆదేశించాడు. అయితే.. బంగ్లా జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ శాంతపర్చడంతో మహ్ముదుల్లా తిరిగి బ్యాటింగ్కు వెళ్లాడు. మ్యాచ్ ముగిశాక బంగ్లా ఆటగాళ్లు నాగిని డ్యాన్స్లతో ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత పలువురి ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు.
కోహ్లీ దేశం విడిచి వెళ్లిపో కామెంట్
సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చాటింగ్ చేస్తోన్న సమయంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోహ్లీ చేసిన దేశం విడిచి వెళ్లిపో వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వివరాల్లోకి వెళితే నవంబర్ 5న పుట్టిన రోజు సందర్భంగా కోహ్లీ తన పేరుతో ఉన్న యాప్ను ప్రారంభించాడు. ఈ యాప్లో ‘కోహ్లి ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి భారత క్రికెటర్ల కన్నా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రీడాకారుల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం' అని సదరు అభిమాని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన విరాట్ కోహ్లీ ‘నువ్వు భారత్లో ఉండాల్సిన వాడివి కాదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో' అని ఘాటుగా బదులిచ్చాడు.
సనత్ జయసూర్యపై స్మగ్లింగ్ ఆరోపణలు
ఎన్నో గొప్ప రికార్డులను తన ఖాతాలో లిఖించిన శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్యపై స్మగ్లింగ్ ఆరోపణలు వచ్చాయి. భారత్కు కోట్ల విలువైన వక్కలను అక్రమ దారిలో పంపినట్లు సనత్ జయసూర్యతో పాటు మరో ఇద్దరు క్రికెటర్లపై స్మగ్లింగ్ ఆరోపణలు వచ్చాయి. నాగ్పూర్లో కోట్ల విలువైన వక్కలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సీజ్ చేసిన సమయంలో జయసూర్య పేరు బయటకు వచ్చినట్లు దైనిక్ భాస్కర్ తన కథనంలో వెల్లడించింది. ఈ స్మగ్లింగ్ కేసులో సనత్ జయసూర్యతోపాటు మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే ఆ ఇద్దరు ఎవరనేది ఇంకా బయటకు రాలేదు. రెవెన్యూ ఇంటిలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ దిలిప్ సివారే వెల్లడించిన వివరాల ప్రకారం వక్కలను సాధారణంగా ఇండోనేషియా నుంచి శ్రీలంకకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇండియాకు ఎగుమతి చేస్తారు. పన్నులు ఎగ్గొట్టడానికి ఇది మంచి మార్గం. ఇందు కోసం జయసూర్యతోపాటు ఆ ఇద్దరు క్రికెటర్లు డమ్మీ కంపెనీలను కూడా సృష్టించారని, తమకున్న పలుకుబడిని ఉపయోగించి వీళ్లు ఆ సంస్థలకు అనుమతులు పొందినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు ఆయన తెలిపారు.
మిథాలీ-కోచ్ రమేశ్ పొవార్ గొడవ
వెస్టిండిస్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ టీ20 సందర్భంగా మిథాలీ రాజ్, మాజీ కోచ్ రమేశ్ పొవార్ల మధ్య నెలకొన్న వివాదం మహిళా క్రికెట్లో సంచలనం సృష్టించింది. ఈ ఆధిపత్య పోరు కారణంగా భారత్ మహిళ వరల్డ్ కప్ గెలిచే సువర్ణావకాశం కోల్పోయేలా చేసింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో తనను అర్థాంతరంగా తప్పించడం వెనుక కోచ్ రమేశ్ పవార్ ఉన్నాడని మిథాలీ రాజ్ ఆరోపించింది. అయితే సమస్య ఆ ఒక్క మ్యాచ్తో మాత్రమే కాదని, తనను లక్ష్యంగా చేసుకొని కోచ్ రమేశ్ పొవార్ వ్యవహరించారని మిథాలీ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొంది. ఇన్నేళ్లపాటు దేశానికి ఆడిన తన పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించారని మిథాలీ అందులో పేర్కొంది. దీంతో రమేశ్ పొవార్ కూడా కాస్తంత ఘాటుగానే స్పందించాడు. ఓపెనర్గా పంపకపోతే ప్రపంచకప్ నుంచి తప్పుకొని, రిటైర్మెంట్ ప్రకటిస్తానని మిథాలీ రాజ్ బెదిరించిందని బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొ్నాడు. అయితే మరొకసారి పొవార్నే కోచ్గా నియమించాలంటూ టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానలు కోరినప్పటికీ బీసీసీఐ మాత్రం పొవార్ను తప్పించి కొత్త కోచ్గా డబ్ల్యూవీ రామన్ను నియమించింది.
పెర్త్ టెస్టులో కోహ్లీ-టిమ్ పైన్ల మధ్య మాటల యుద్దం
నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. ఆఖరి సెషనల్లో అతిగా డిఫెన్స్ ఆడుతున్న పైన్ను నువ్విలా ఆడితే 2-0 ఆధిక్యం ఖాయం అంటూ కోహ్లీ కవ్వించాడు. మీవరకు బ్యాటింగ్ వస్తే కదా అంటూ పైన్ బదులివ్వడం స్టంప్స్ మైక్లో రికార్డు అయింది. నాలుగోరోజు ఉస్మాన్ ఖవాజాతో కలిసి టిమ్పైన్ జోడీ నిలకడగా ఆడుతూ భారత పేసర్లకు సవాల్ విసిరారు. రెండో ఇన్నింగ్స్లో 71వ ఓవర్ను టీమ్ ఇండియా పేసర్ జస్పీత్ బుమ్రా వేశాడు. అతని బౌలింగ్లో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు ఫీల్డర్ను నియమించేందుకు విరాట్ కోహ్లీ నిర్ణయించాడు.
ఈ దశలో పైన్.. కోహ్లీతో మాటల యుద్ధానికి తెరతీశాడు. 'నిన్న నువ్వే కదా నియంత్రణ కోల్పోయావు. మరి ఈ రోజెందుకు ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు' అని అన్నాడు. అక్కడే ఉన్న ఫీల్డ్ అంపైర్ గఫానీ కలుగజేసుకుని 'ఇక చాలు.. ఇక చాలు అంటూ ఆటను కొనసాగించండి. మీరిద్దరూ జట్టు కెప్టెన్స్ అన్న విషయం మరిచిపోవద్దు. టిమ్.. నువ్వు కెప్టెన్వి' అని ఆవేశాన్ని చల్చార్చే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా పైన్ 'మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. మేం కవ్వించుకోవడం లేదు. విరాట్ కోహ్లీ నీ ప్రశాంతతను కొనసాగించు' అని గఫానీకి బదులిచ్చాడు.
ఇక, కోహ్లీ ఔటైన తర్వాత కూడా క్రీజ్లో ఉన్న విజయ్తో ‘అతను నీ కెప్టెన్ అని నాకు తెలుసు. కానీ వ్యక్తిగా నువ్వు కూడా అతడిని ఇష్టపడవు' అని పైన్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ ఘటనలో ఇరుజట్ల ఆటగాళ్లు హద్దులు దాటలేదని, ఇవి ఆటలో సర్వసాధారణమే అని కొట్టిపారేశారు. కానీ ఆసీస్ మీడియా మాత్రం ఈ ఘటనలో కెప్టెన్ కోహ్లిని విలన్గా చూపించే ప్రయత్నం చేసిందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.