చెన్నై: దులీప్ ట్రోఫీ ఫైనల్స్ రసకందాయంలో పడింది. చివరిరోజు భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఫైనల్స్ ఆడుతున్న సౌత్ జోన్-వెస్ట్ జోన్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్నాయి. వెస్ట్ జోన్ లీడ్లో కొనసాగుతోంది. లంచ్ సమయానికి 458 పరుగుల భారీ ఆధిక్యతను అందుకుంది. లంచ్ విరామానికి వెస్ట్ జోన్ తన రెండో ఇన్నింగ్లో నాలుగు వికెట్లను కోల్పోయి 515 పరుగులు చేసింది. భోజనానంతరం ఇన్నింగ్ డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి.
అయిదో రోజు వెస్ట్ జోన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ హైలైట్. యశస్వి జైస్వాల్ 265 పరుగులు చేశాడు. కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్లో స్టంపవుట్గా వెనుదిరిగాడు. కేప్టెన్ అజింక్య రహానె నిరాశపరిచాడు. 15 పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ప్రియాంక్ పంచాల్-40, శ్రేయాస్ అయ్యర్-71 పరుగులతో జట్టు భారీ ఇన్నింగ్కు బాటలు వేశారు.
మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. లంచ్ విరామ సమయానికి 91 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. హెట్ పటేల్ 18 పరుగులతో అతనికి తోడుగా నిలిచాడు. సౌత్ జోన్ టీమ్ బౌలర్లు పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు. కృష్ణప్ప గౌతమ్, ఆర్ సాయి కిషోర్ రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ స్ఫూర్తిదాయకంగా పోరాడాడు. 100 శాతం ఫిట్నెస్ లేకపోయినప్పటికీ 10 గంటల పాటు క్రీజ్లో నిలిచాడు.
మొత్తంగా 323 బంతులను ఎదుర్కొన్న యశస్వి 30 ఫోర్లు బాదాడు. నాలుగు సార్లు బంతిని ఫెన్సింగ్ దాటించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1000 పరుగులను కంప్లీట్ చేసుకున్నాడు. 91.0 స్ట్రైక్ రేట్తో 1000 పరుగుల ల్యాండ్ మార్క్ను అందుకోవడం అంటే మాటలు కాదు. అది అతని నిలకడ, బ్యాటింగ్ విజృంభణకు అద్దం పడుతోంది. అండర్-19 వరల్డ్ కప్లో 62, సెమీస్లో 103, ఫైనల్స్లో 88 పరుగులు చేశాడు యశస్వి. రంజీల్లో పరుగుల వరద పారించాడు.
రంజీ క్వార్టర్స్లో 103, తొలి సెమీస్లో 103, రెండో సెమీఫైనల్లో 100, ఫైనల్స్లో 78 పరుగులతో సత్తా చాటాడు. ఇప్పుడు తాజాగా దులీప్ ట్రోఫీలో ఆ దూకుడును కొనసాగించాడు. రెండుసార్లు డబుల్ సెంచరీ చేశాడు. దులీప్ ట్రోఫీ క్వార్టర్స్లో 228, ఫైనల్స్లో 265 పరుగులు చేశాడు. 20 ఏళ్ల కుర్రాడు ఈ స్థాయిలో క్రికెట్ ఆడటం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. టీమిండియా ఫ్యూచర్ స్టార్గా పోస్ట్స్ పెడుతున్నారు.