ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా:
యశస్వి జైశ్వాల్ తాజాగా 'ఇండియా టుడే' జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఇదే నా తొలి ఐపీఎల్. ఎంతో సంతోషంగా ఉన్నా. ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ సీజన్లో నా శక్తి మేరకు రాణించి మంచి ప్రదర్శన చేస్తా. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడటం నాకు ఎంతో ఉపయోగం. స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ లాంటి ప్రపంచస్థాయి మేటి ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం ఉంటుంది. వారితో విలువైన సూచనలు తీసుకోవచ్చు. వారి నుంచి నేర్చుకోడానికి ఆసక్తి ఉన్నా' అని అన్నాడు.
ఏదీ సులభంగా రాలేదు:
ఏదేమైనా బాల్యంలో ఎదురైన కఠిన పరిస్థితులు తనను మానసికంగా బలంగా ఎదగడానికి సహాయపడ్డాయని జైస్వాల్ పేర్కొన్నాడు. 'నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు, పానీ పానిపురిస్ను అమ్ముతున్నప్పుడు ఏ విషయం గురించి ఆలోచించలేదు. ఎందుకంటే.. అప్పుడు ఆ సమయం నాకు ఎంతో అనవసరం. దాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. అలా చేయడం మంచిదని నాకు తెలుసు. నేను ఏదీ సులభంగా పొందలేదు. ప్రతిసారీ కష్టపడాల్సి వచ్చింది. కఠిన పరిస్థితులే నన్ను మానసికంగా బలంగా ఎదగడానికి సహాయపడ్డాయి' అని
జైశ్వాల్ చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్లో 400 పరుగులు:
గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో యశస్వి జైశ్వాల్ కేరళపై డబుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ద్విశతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇక ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్లో అదరగొట్టాడు. ఈ టోర్నీలో మొత్తం 400 పరుగులతో' 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యాడు. టోర్నీలో ఆరు మ్యాచ్లాడిన జైశ్వాల్ ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీ (88, 105, 62, 57, 29, 59)లు చేసాడు.
ప్రపంచకప్ అవార్డు ముక్కలు:
ప్రపంచకప్ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసినా.. ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో యశస్వి జైశ్వాల్ చాలా నిరాశకి గురయ్యాడు. ఈ క్రమంలోనే తనకి లభించిన ట్రోఫీని అతను పగలగొట్టుకున్నాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చాక చూస్తే అతడి ట్రోఫీ రెండు ముక్కలై కనిపించిందట. అయితే ట్రోఫీకి ఏం జరిగిందో మాత్రం అతడికి గుర్తులేదట.