స్పెషల్ ప్లాన్స్తో..
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై పంత్ ఎదురుదాడికి దిగిన విషయాలపై తాము అధ్యయనం చేసామని, ప్రత్యేక ప్రణాళికలతో పంత్ను కట్టడి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఫైట్ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన షేన్ జర్గెన్ సెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బౌలింగ్ అటాక్ పై కూడా ప్రశంశల వర్షం కురిపించాడు. బుమ్రా, షమీ, సిరాజ్, ఇషాంత్లతో కూడిన టీమిండియా పేస్ దళం అద్భుతంగా ఉందని కొనియాడాడు.
డేంజరెస్ బ్యాట్స్మన్..
'రిషభ్ పంత్ అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్. క్షణాల్లో ఆటను మార్చేయగలడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీసుల్లో అతను ఎంత బాగా ఆడాడో మనమంతా చూశాం. పంత్ సానుకూల ఆలోచనా ధోరణితో ఆడుతాడు. కానీ అదే అతడి వికెట్ తీయడానికి మాకు అవకాశంగా మారుతుంది. మా బౌలర్లు అత్యంత కచ్చితత్వంతో బంతులు వేయాలి. ప్రశాంతంగా ఉండాలి. పంత్ పరుగులు చేయకుండా ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే అతను స్వేచ్ఛగా ఆడే బ్యాట్స్మన్. పైగా ఆపడం కష్టం. మా బౌలర్లు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి.
సూపర్ బౌలింగ్..
ఆర్సీబీకి ఆడేటప్పుడు కైల్ జేమీసన్, విరాట్ కోహ్లీ ఫైనల్ గురించి కచ్చితంగా మాట్లాడుకొనే ఉంటారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్, ఇషాంత్ శర్మలతో కూడిన టీమిండియా బౌలింగ్ విభాగం కూడా బాగుంది. ఇక శార్దూల్ ఠాకూర్ బ్యాటింగూ చేయగలడు. ఆస్ట్రేలియాలో అతని ఆటను మనం చూశాం. అంతేకాకుండా వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు భారత్ సొంతం. రవీంద్ర జడేజా, అశ్విన్ వైవిధ్యంగా బౌలింగ్ చేయలగలరు. అక్షర్ పటేల్ అదనపు బలం' అని జర్గెన్సెన్ తెలిపాడు.
ఇంగ్లండ్తో కివీస్కు ప్రాక్టీస్..
ఈ ప్రతిష్టాత్మక పోరులో తలపడేందుకు కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు ఇదివరకే ఇంగ్లండ్కు చేరుకుంది. ఈ పర్యటనలో కివీస్ జట్టు టెస్టు చాంపియన్షిప్ ఫైనల్స్కు ముందు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది. కాగా, ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం భారత జట్టు జూన్ 2న లండన్ కు బయల్దేరనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్స్తో పాటు ఆతిధ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఇంగ్లండ్లో 3 రోజుల పాటే హార్డ్ క్వారంటైన్ ఉండనుంది.