టీమిండియా ప్రయాణం రేపే..
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడటానికి విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు బుధవారం ఇంగ్లాండ్కు బయలుదేరి వెళ్తుంది. మరుసటి రోజు ఇంగ్లాండ్ గడ్డపై దిగుతుంది. నేరుగా క్వారంటైన్కు వెళ్తుంది. బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన తాజా అనుమతుల నేపథ్యంలో.. కోహ్లీ సేన తమ భార్యా బిడ్డలతో విమానం ఎక్కనుంది. క్రికెటర్లు వారం రోజుల పాటు భారత్లో క్వారంటైన్ గడిపినప్పటికీ.. అక్కడ కూడా ఇది తప్పదు. ఇంగ్లాండ్లో అడుగు పెట్టిన తరువాత మరో మూడురోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే- ప్రతి ఆటగాడు కూడా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా అక్కడి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.
ఫ్యామిలీ టూర్గా
ఎల్లుండి ఇంగ్లాండ్లో అడుగు పెట్టనున్న టీమిండియా.. ఇక మళ్లీ అక్కడి నుంచి బయటపడేది సెప్టెంబర్ 15వ తేదీ తరువాతే. ఈ నెల 18వ తేదీన సౌథాంప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో న్యూజిలాండ్తో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడుతుంది. దీని తరువాత.. 42 రోజుల పాటు అక్కడే ఖాళీగా గడుపుతుంది. బీసీసీఐ డిజైన్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 22వ తేదీన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తరువాత.. ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ ఆరంభం కావడానికీ మధ్య నెలన్నర వ్యవధి ఏర్పడింది. అంటే 42 రోజుల పాటు భారత జట్టు ఇంగ్లాండ్లో ఖాళీగా ఉంటుంది.
ఆగస్టు 4న తొలి టెస్ట్..
ఇంగ్లాండ్తో టీమిండియా అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆగస్టు 4వ తేదీన నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్లో ఆరంభమౌతుంది. చివరి టెస్ట్ సెప్టెంబర్ 14వ తేదీన ముగుస్తుంది. అదే నెల 12 నుంచి 16 మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ లండన్లో, 25 నుంచి 29 మధ్య మూడో టెస్ట్ లీడ్స్లోని హెడింగ్లే స్టేడియంలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ-ఈసీబీ. నాలుగో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 2వ తేదీన ఉంటుంది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో ఈ మ్యాచ్ ఆరంభమౌతుంది. అయిదో టెస్ట్కు మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ వేదికైంది. సెప్టెంబర్ 14వ తేదీన చివరి టెస్ట్ ముగుస్తుంది. జూన్ 3న ఇంగ్లాండ్లో దిగే టీమిండియా సెప్టెంబర్ 14 వరకూ అక్కడే ఉంటుంది. సుదీర్ఘమైన సిరీస్ కావడం వల్ల భార్యా బిడ్డలతో కలిసి ప్రయాణించడానికి బ్రిటన్ ప్రభుత్వం కోహ్లీసేనకు అవకాశాన్ని ఇచ్చింది.