
సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ను వరణుడు వదలడం లేదు. వర్షంతో ఇప్పటికే రెండున్నర రోజు ఆట తుడిచిపెట్టుకుపోగా.. ఐదో రోజు వానదేవుడు భలే ట్విస్ట్ ఇచ్చాడు. రాత్రి నుంచి పూర్తిగా విరామం తీసుకున్న వరణుడు.. సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు మళ్లీ మొదలుపెట్టాడు. దాంతో ఐదో రోజు ఆట ప్రారంభానికి అంతరాయం కలిగింది. మైదానంలో చిరుజల్లులు కురుస్తుండటంతో అంపైర్లు ఇంకా ఆటను ప్రారంభించలేదు. ప్రస్తుతానికైతే చిరుజల్లులే కురుస్తున్నప్పటికీ.. పెద్దగా అయితే మాత్రం ఈ రోజు కూడా కొంత భాగం ఆటకోల్పోవాల్సిందే.
వాస్తవానికి బ్రిటన్ వాతావరణ శాఖ ఈ రోజు వర్షం అంతరాయం ఉండదని చెప్పింది. ఇప్పటి వరకు వారు చెప్పినట్లే జరిగింది. కానీ ఈ రోజు మాత్రం అనూహ్యంగా వచ్చిన వరణుడు అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. వర్షానికి సంబంధించిన అప్డేట్ను బీసీసీఐ కూడా అభిమానులతో పంచుకుంది. మైదానంలో కవర్లు కప్పుతున్న ఫొటోను షేర్ చేసి మ్యాచ్కు ఆలస్యం కానుందని పేర్కొంది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో మ్యాచ్ 4 గంటలకు ప్రారంభం కానుంది.
ఒక్క సెషన్ ఆట రద్దయినా.. మ్యాచ్ డ్రాగా మగియనుంది. ఇప్పటికే 80 శాతం డ్రా అయ్యే అవకాశాలు ఉండగా.. తాజా అంతరాయంతో ఆ 20 శాతం ఆశలు కూడా సన్నగిల్లాయి. మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిస్తే ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ టైటిల్ను ఇరు జట్లు షేర్ చేసుకోనున్నాయి. ఇక రిజర్వ్ డే ఆడించడంపై కూడా ఐదో రోజు ఆట చివరి గంటలో మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకోనున్నాడు. ఫలితం తేలే అవకాశం ఉంటేనే రిజర్వ్ డేలో ఆటను కొనసాగించనున్నారు. తాజా అంతరాయంతో మ్యాచ్ ఫలితం తేలడం కష్టంగా మారింది.
ఇక కైల్ జేమీసన్ (5/31) నిప్పులు చెరగడంతో భారత్ 92.1 ఓవర్లలో 217 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. తర్వాత న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 59 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు ఆట వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.