WTC Final: సెంచరీలు కాదు.. జట్టు గెలుపు కోసం పరుగులు చేయడమే నాకు ముఖ్యం! 30-40 రన్స్ చేసినా ఆనందమే!

సౌథాంప్టన్: సెంచరీ చేసినా చేయకపోయినా జట్టు గెలవడమే తనకు ముఖ్యమని టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. జట్టు గెలుపునకు ఉపయోగపడే 30 లేదా 40 పరుగులు చేసినా తనకు ఆనందమే అని పేర్కొన్నాడు. విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని, నిజానికి వాటివల్లే తానీ స్థాయిలో ఉండగలిగానని జింక్స్ చెప్పాడు. జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021 ఆరంభం కానుంది. ఇంగ్లండ్లోని సౌథాంప్టన్ వేదికగా ఈ టైటిల్ పోరు జరగనుంది.

విమర్శలను పట్టించుకోను
డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా అజింక్య రహానే మాట్లాడుతూ... 'అందరికంటే ఎక్కువ పరుగులు చేయడం ప్రత్యేకమే. కానీ జట్టు విజయం కోసం ఎన్ని పరుగులు చేశామన్నదే నాకు ముఖ్యం. ప్రతిసారీ నేను అదే ఆలోచిస్తాను. విమర్శలకు నేను సంతోషిస్తాను. నిజానికి వాటివల్లే నేనిక్కడ ఉన్నాను. విమర్శలు వచ్చినా.. రాకున్నా అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తాను. నిజం చెప్పాలంటే వాటిని నేను పెద్దగా పట్టించుకోను. ఒక బ్యాట్స్మన్గా లేదా ఫీల్డర్గా దేశం కోసం కష్టపడతాను' అని అన్నాడు. టెస్టు ఛాంపియన్షిప్లో 17 మ్యాచులాడిన జింక్స్ 1095 పరుగులు చేశాడు.
WTC Final 2021: రవీంద్ర జడేజాకే వీవీఎస్ లక్ష్మణ్ ఓటు.. తెలుగు క్రికెటర్పై వేటు!!

సెంచరీ చేయాలన్న ఒత్తిడి ఉంచుకోను
'విమర్శలు చేయడం విమర్శకుల పని. క్రికెట్ ఆడడం నా పని. అందుకే నా నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించను. నా బ్యాటింగ్ ప్రక్రియపై దృష్టి పెట్టి పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాను. నేనెప్పుడూ నా సహజ శైలిలోనే ఆడతాను. నేను సెంచరీ చేసినా చేయకపోయినా జట్టు గెలవడమే మాకు ముఖ్యం. అందుకే ప్రతిసారీ వంద చేయాలన్న ఒత్తిడి నాపై ఉంచుకోను.
గెలుపునకు ఉపయోగపడే 30 లేదా 40 పరుగులు చేసినా ఆనందమే' అని రహానే తెలిపాడు. గతంలో ఇంగ్లండ్లో పర్యటించిన అనుభవం రహానేకు ఉంది. 2014, 2018లో అక్కడ టెస్టులు ఆడాడు. ఇక 2019లో హాంప్షైర్ కౌంటీ తరఫున ఆడాడు. దాంతో ఇంగ్లిష్ పరిస్థితులపై అతడికి మంచి అవగాహన ఉంది.

వారికి నేనేమీ సలహాలు ఇవ్వను
'ఇంగ్లండ్ పరిస్థితులు నాకు తెలుసు. వాటికి అలవాటు పడటం చాలా కీలకం. ఇక్కడ నేను ఎక్కువ పరుగులు చేశానన్నది గతం. వాటివల్ల ఒత్తిడి పెంచుకోకుండా స్వేచ్ఛగా ఆడాలని అనుకుంటున్నా. డబ్ల్యూటీసీ ఫైనల్కు మానసికంగా సన్నద్ధమవ్వడం ముఖ్యం. ఇదీ అన్ని మ్యాచుల్లాగే ఒక టెస్టు. రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ బాగా ఆడుతున్నారు.
వారికి నేనేమీ సలహాలు ఇవ్వను. స్వేచ్ఛగా, తమ సామర్థ్యం మేరకు ఆడాలని చెబుతాను. ఇంగ్లీష్ పిచ్లు బౌలర్లకు సహకరిస్తాయి. కాబట్టి బ్యాట్స్మెన్ పరుగులు చేయడంపైనే విజయం ఆధారపడి ఉంటుంది' అని టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications