WTC Final 2021: రవీంద్ర జడేజాకే వీవీఎస్ లక్ష్మణ్ ఓటు.. తెలుగు క్రికెటర్పై వేటు!!

సౌథాంప్టన్: జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021 ఆరంభం కానుంది. ఇంగ్లండ్లోని సౌథాంప్టన్ వేదికగా ఈ టైటిల్ పోరు జరగనుంది. ప్రతిష్టాత్మక చాంపియన్షిప్ ఫైనల్లో ఎలాంటి కాంబినేషన్తో బరిలో దిగాలన్నదానిపై టీమిండియా మేనేజ్మెంట్ కసరత్తులు చేస్తోంది. బ్యాటింగ్ లైనప్పై ముందునుంచే స్పష్టత ఉన్నా.. కీలకమైన బౌలింగ్పై కాస్త సందేహాలు నెలకొన్నాయి. ఇంగ్లిష్ కండీషన్స్, పిచ్తో పాటు ప్రత్యర్థి న్యూజిలాండ్ లైనప్ను దృష్టిలో పెట్టుకుని తుది జట్టును ఎంచుకోవాల్సి ఉంది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్ లేదా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల స్ట్రాటజీతో భారత్ ఆడనుంది.

విహారిపై వేటు:
ఈ నేపథ్యంలో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ జట్టు తుది కూర్పుపై టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ కీలక సూచనలు చేశాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల స్ట్రాటజీతో భారత్ బరిలోకి దిగాలని సూచించాడు. ఇద్దరు స్పిన్నర్ల స్థానంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను తీసుకోవాలి కెప్టెన్ విరాట్ కోహ్లీకి హింట్ ఇచ్చాడు. అలా అయితే తెలుగు క్రికెటర్ హనుమ విహారిపై వేటు పడనుంది. 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. అదనపు బ్యాట్స్మెన్గా విహారి ఎంపికయ్యాడు.

జడేజాకు అవకాశం ఇస్తా:
స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ... 'డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఐదుగురు బ్యాట్స్మెన్లను తుది జట్టులోకి ఎంపిక చేస్తా. ఆరో స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ని ఆడిస్తా. ఏడో స్థానంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు అవకాశం ఇస్తా. 8వ స్థానంలో ఆర్ అశ్విన్ బ్యాటింగ్ చేస్తాడు. జడేజా మంచి బ్యాట్స్మన్ కంటే కూడా బాగా ఆడతాడు. ఒత్తిడి సమయాల్లోనూ జడేజా మ్యాచ్లను గెలిపించే ఇన్నింగ్స్ ఆడగలడు. ఆ సామర్థం అతనికి ఉంది కాబట్టి నెం.7లో ఆడిస్తా' అని అన్నాడు. జడేజాని తుది జట్టులోకి తీసుకుంటే.. హనుమ విహారిపై వేటు పడటం ఖాయమే.

సన్నీ సైతం:
డబ్ల్యూటీసీ ఫైనల్లో రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ ఇద్దరినీ ఆడించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం సూచించారు. సౌథాంప్టన్లో వాతావరణం చాలా పొడిగా ఉంటుందని తెలిపారు. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్పై పగుళ్లు ఏర్పడి స్పిన్కు అనుకూలిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా జడేజా, అశ్విన్ ఆల్రౌండ్ సామర్థ్యాలు జట్టుకు ఉపయోగపడతాయన్నారు. ఇద్దరూ బౌలింగ్ విభాగానికే కాకుండా బ్యాటింగ్ లైనప్కూ సమతూకం తీసుకొస్తారని సన్నీ చెప్పుకొచ్చారు.

భారత జట్టు:
రోహిత్ శర్మ, శుభ్మన్గిల్, పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానె(వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(కీపర్), సాహా(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications