జట్టు ఎంపిక నా చేతుల్లో లేదు:
తాజాగా వృద్ధిమాన్ సాహా ఓ మీడియా సమావేశంలో పాల్గొని ఆసీస్ అనుభవాలను పంచుకున్నాడు. 'రిషబ్ పంత్కు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇదే విషయాన్నీ మీరు అతణ్ని కూడా అడగొచ్చు. తుది జట్టులో ఎవరికి చోటు దక్కినా.. ఒకరికొకరం సాయం చేసుకుంటాం. వ్యక్తిగతంగానూ అతనితో నాకెలాంటి విభేదాలు లేవు. నంబర్ 1, నంబర్ 2 అంటూ ఎవరూ లేరు. ఉత్తమంగా రాణించిన వాళ్లకు జట్టు అవకాశమిస్తుంది. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. జట్టు ఎంపిక నా చేతుల్లో లేదు' అని సాహా తెలిపాడు.
ధోనీతో పోల్చడం సరికాదు:
'వికెట్ కీపింగ్లో రిషబ్ పంత్ మెరుగవుతున్నాడు. ఎవరూ మొదటి తరగతిలోనే అన్నీ నేర్చుకోరు కదా!. ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లాలి. పరిణతి సాధించిన అతను.. తానెంటో నిరూపించుకున్నాడు. అయితే అతడ్ని ఎంఎస్ ధోనీతో పోల్చడం సరికాదు. ఎవరి వ్యక్తిగత గుర్తింపు వాళ్లకుంటుంది' అని వృద్ధిమాన్ సాహా అన్నాడు. ఐపీఎల్ 2020లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన సాహాకు ఆస్ట్రేలియా పర్యటనలో చోటు దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పర్వాలేదనిపించిన పంత్కు.. మొదటి టెస్టులో అవకాశం దక్కలేదు. ఆపై మూడు టెస్టులు ఆడి టెస్ట్ సిరీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.
రహానే ప్రశాంతంగా పని కానిచ్చాడు:
తొలి టెస్టులో విఫలమవడంతో సిరీస్లో మిగిలిన మూడు మ్యాచ్లకు జట్టులో చోటు దక్కకపోవడంపై సాహా స్పందిస్తూ.. 'ఎవరి కెరీర్లోనైనా విఫల దశ ఉంటుంది. ఓ ప్రొఫెషనల్ ఆటగాడిగా ఒడుదొడుకులను అంగీకరిస్తూ సాగాలి. ఆస్ట్రేలియాలో ఈ సిరీస్ విజయం ప్రపంచకప్ గెలుపునకు ఏ మాత్రం తీసిపోదు. అజింక్య రహానే ప్రశాంతంగా పని కానిచ్చాడు. విరాట్ కోహ్లీలాగే అతనూ ఆటగాళ్లను పూర్తిగా నమ్ముతాడు. కానీ భావోద్వేగాలను మాత్రం బయటపెట్టడు. సహచరుల్లో ఎలా స్ఫూర్తి నింపాలో తనకు తెలుసు. అతని విజయ రహస్యమదే' అని సాహా పేర్కొన్నాడు.
5 ఇన్నింగ్స్లలో 274 పరుగులు:
రిషభ్ పంత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో అద్భుతంగా రాణించాడు. పింక్ బాల్ టెస్టులో సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. 5 ఇన్నింగ్స్లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97. రెండో టెస్టులో మోస్తరుగా రాణించాడు. సిడ్నీ టెస్టులో భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను తన దూకుడు బ్యాటింగ్తో విజయం వైపు నడిపించాడు. ఆ మ్యాచ్లో 97 పరుగులు చేసిన అతడు త్రుటిలో శతకం చేజార్చుకొని ఔటయ్యాడు. ఒకవేళ ఔటవ్వకుండా అలాగే బ్యాటింగ్ చేసి ఉంటే.. ఆ మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించే అవకాశం ఉండేది. గబ్బా టెస్టులో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్న వేళ పుజారా (56), సుందర్ (22)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే చివర్లో మరింత దూకుడుగా ఆడిన పంత్ భారత్కు అపురూప విజయం అందించాడు.