హైదరాబాద్: ప్రత్యర్ధి బౌలర్లను బట్టి జట్టులో బ్యాటింగ్ లైనప్లో నెంబర్ 6వ స్ధానంలో బ్యాట్స్మన్ మారుతూ ఉంటారని టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో సాహా తొలి ఇన్నింగ్స్లో 7వ స్ధానంలో రాగా, రెండో ఇన్నింగ్స్లో 8వ స్ధానంలో క్రీజులోకి వచ్చాడు.
వేర్వేర్ స్ధానాల్లో ఆడుతున్నప్పుడు బ్యాలెన్స్ దెబ్బతింటుందా? అన్న ప్రశ్నకు సాహా స్పందించాడు. 'అలాంటిదేమీ లేదు. ఆరో స్థానంలో ఎలా ఆడతానో ఏడు, ఎనిమిది స్థానాల్లోనూ అలాగే ఆడతా. ప్రత్యర్థి బౌలర్ల బలాబలాలను బట్టి మేం (అశ్విన్, జడేజా, నేను) బ్యాటింగ్ స్థానాలను మార్చుకుంటాం' అని సాహా అన్నాడు.
'పరిస్థితులు, ప్రత్యర్ధి జట్టు బౌలర్లను బట్టి జట్టు యాజమాన్యాన్ని బట్టి ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తాం' అని అన్నాడు. టెస్టు క్రికెట్కు వీవీఎస్ లక్ష్మణ్ వీడ్కోలు పలికిన తర్వాత ఆ స్ధానాన్ని భర్తీ చేయగలిగిన సమర్ధవంతమైన ఆటగాడిని టీమిండియా ఇప్పటికీ వెతకలేకపోయిందనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.
శ్రీలంకతో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో మరికొన్ని ఓవర్లకు సమయం ఉంటే విజయం సాధించే వాళ్లమని సాహా పేర్కొన్నాడు. తొలి టెస్టులో గెలిచేందుకు తాము శ్రాయశక్తులా ప్రయత్నించామని సాహా తెలిపాడు. కొన్ని నిర్ణయాలు త్వరగా తీసుకుని ఉంటే మరింత బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
టెస్టులో ఐదుగురు బౌలర్లు ఆడుతున్నప్పుడు లోయర్ ఆర్డర్ కూడా బ్యాటింగ్లో విజృంభించాల్సి ఉంటుందని అన్నాడు. 'టెస్టు క్రికెట్లో 20 వికెట్లు తీస్తే తప్పగ గెలుస్తాం. కాబట్టి బౌలర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఐదుగురు బౌలర్లు ఆడుతున్నప్పుడు లోయర్ ఆర్డర్ కూడా మెరుగవ్వాలి' అని అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.