
హైదరాబాద్: కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అరుదైన రికార్డుని సాధించాడు. టీమిండియా తరఫున ఒక టెస్టులో అత్యధిక క్యాచ్లు అందుకున్న వికెట్ కీపర్గా ధోని రికార్డుని అధిగమించాడు.
కేప్ టౌన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఐదు క్యాచ్లు అందుకున్న సాహా.. రెండో ఇన్నింగ్స్లోనూ ఐదు క్యాచ్లు అందుకున్నాడు. తద్వారా పది వికెట్లను పడగొట్టడంలో భాగస్వామ్యం సాధించిన తొలి వికెట్ కీపర్గా అరుదైన ఘతన సాధించాడు.
2014-15 సీజన్లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్గా 9 మంది బ్యాట్స్మెన్ను పెవిలియన్ చేర్చాడు. ఇదిలా ఉంటే కేప్ టౌన్ వేదికగా సొంతగడ్డపై భారత్తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 130 పరుగులకే ఆలౌటైంది.
వర్షం కారణంగా మూడో రోజు ఆట రద్దు అయిన నేపథ్యంలో నాలుగో రోజైన సోమవారం ఓవర్ నైట్ స్కోరు 65/2తో ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా భారత పేసర్ల ధాటిగా వరుసగా వికెట్లను కోల్పోయింది. నాలుగో రోజు ఆటలో డివిలియర్స్ (35), కేశవ్ మహారాజ్ (15) మినహా మరే బ్యాట్స్మెన్ రెండంకెల స్కోరు చేయలేదు.
అలా వచ్చి ఇలా ఔటయ్యారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 41.2 ఓవర్లకు గాను 130 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 77 పరుగుల ఆధిక్యం కలుపుకుని కోహ్లీసేనకు 208 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో షమీ, బుమ్రా చెరో 3 వికెట్లు తీసుకోగా... భువీ, పాండ్యా తలో 2 వికెట్లు తీసుకున్నారు.
తొలి ఇన్నింగ్స్లోనూ ఈ నలుగురు బౌలర్లకు వికెట్లు దక్కాయి. రెండు ఇన్నింగ్స్ల్లోనూ భారత్ తరఫున నలుగురు ఫాస్ట్ బౌలర్లు కనీసం ఒక వికెట్నైనా తమ ఖాతాలో వేసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.