న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీలను భారీ మొత్తానికి కట్టబెట్టిన బీసీసీఐ.. ఇప్పుడు ప్లేయర్ల ఆక్షన్కు రెడీ అవుతున్నది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 13న ముంబైలో ప్లేయర్ల వేలాన్ని నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యూజిలాండ్తో మూడో టీ20 సందర్భంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వేలానికి సంబంధించి అధికారిక నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.
'వేలానికి సంబంధించిన పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నెల 13 లేదా 14న ఉండొచ్చని అంటున్నారు. దీనిపై మాకు అధికారిక సమాచారం లేదు. కొత్త లీగ్ కాబట్టి ప్రిపరేషన్స్ చాలా పకడ్బందీగా ఉండాలి. ప్రతీ ప్లేయర్ గురించి అన్ని విషయాలను మేం తెలుసుకోవాల్సి ఉంటుంది'అని అదాని స్పోర్ట్స్ లైన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మొత్తం వెయ్యిమంది ప్లేయర్లు వేలం కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం.
ముంబై వేదికగా వేలం నిర్వహించాలని భావించిన బీసీసీఐకి హోటల్స్ దొరకకపోవడం ఇబ్బందిగా మారిందని క్రిక్ బజ్ పేర్కొంది. పెళ్లిళ్లు, శుభకార్యల సీజన్ కావడంతో హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయని, హోటల్ బుక్ కాకపోవడంతోనే బీసీసీఐ ఇంకా ఆక్షన్ డేట్ను ఫిక్స్ చేయలేదని ఓ కథనాన్ని ప్రచురించింది.
ఐదు జట్ల మధ్య జరగనున్న డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్లో మొత్తం 22 మ్యాచ్లు జరగనున్నాయి. మ్యాచ్లన్నీ ముంబైలోని బార్బోర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. లీగ్ మార్చి తొలి వారంలో ప్రారంభమై చివరి వారంలో ముగిసే అవకాశం ఉంది. ఐదు జట్ల విక్రయాల ద్వారా బీసీసీఐకి రూ.4,669.99 కోట్లు రాగా.. వచ్చే ఐదేళ్ల మీడియా రైట్స్ను రిలయన్స్కు చెందిన వయాకామ్ సంస్థ రూ.951 కోట్లకు కొనుగోలు చేసింది.
అహ్మదాబాద్, మంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో బేస్ ఫ్రాంచైజీల కోసం మొత్తం 30 కంపెనీలు పోటీపడగా.. అత్యధిక ధరను బిడ్ వేసిన ఆదాని గ్రూప్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, కాప్రి గ్లోబల్ సంస్థలు మహిళా ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి.