దుబాయ్: సంప్రదాయ టెస్టు క్రికెట్ అభిమానులకు మరింత చేరువ చేసేందుకు ఐసీసీ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్లోని అక్లాండ్ వేదికగా గతేడాది జరిగిన ఐసీసీ బోర్డు వార్షిక సమావేశంలో ఛైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలోని ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు శ్రీకారం చుట్టింది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా టెస్ట్ హోదా పొందిన తొమ్మిది జట్లతో టెస్ట్ క్రికెట్ లీగ్ను ఐసీసీ నిర్వహిస్తోంది. మొత్తం రెండేళ్ల పాటు జరిగే ఈ లీగ్లో మూడు స్వదేశీ సిరీస్లు, మూడు విదేశీ సిరీస్లుగా నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే మొత్తం తొమ్మిది జట్ల మధ్య 27 ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించనున్న ఐసీసీ.. చివరకు ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతను నిర్ణయిస్తుంది. 2019 ఆగస్టు 1 నుంచి 2021 ఏప్రిల్ 30 మధ్య కాలంలో ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ లీగ్ జరగనుంది.
టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి పలువురు ఆటగాళ్లు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. 'క్రికెట్ ఆటలో టెస్టు క్రికెట్టే అత్యున్నతమైంది. టెస్టు ఫార్మాట్ క్రికెట్కు అవసరం. ఆటగాళ్లలో ఎక్కువ మంది టెస్టుల్లో రాణించాలనే కోరుకుంటారు. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ అద్భుతమైన ముందడుగు. ఇక నుంచి ప్రతి టెస్టు సిరీస్ ప్రతిష్ఠాత్మకమే' అని ఇంగ్లాండ్ పేసర్ జిమ్మీ అండర్సన్ పేర్కొన్నాడు.
'ప్రతి మ్యాచ్ ఎంత కీలకమో ఐసీసీ వన్డే ప్రపంచకప్ తెలియజేసింది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లు ఫైనల్లో తలపడతాయి. రాబోయే రెండేళ్లలో ద్వైపాక్షిక టెస్టు సిరీస్లకు ఛాంపియన్షిప్ ఓ అర్థం, పరమార్థం కల్పిస్తుంది' అని ఐసీసీ అధికారి జీఎం జెఫ్ అలార్డిస్ అన్నాడు. 'ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఈ ఫార్మాట్లో ముందడుగు. టెస్టు క్రికెట్ ఆడటాన్ని ఇష్టపడతా. ఇప్పుడు అన్ని దేశాలు టెస్టులకు సముచిత స్థానం కల్పిస్తాయి' అని ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ చెప్పుకొచ్చారు.