ప్రపంచకప్ ఫైనల్: ఓవర్త్రోలో స్టోక్స్-గుప్టిల్ పాత్రపై సెప్టెంబర్లో సమీక్ష!

హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్లో అనూహ్యంగా ఓవర్త్రో ద్వారా ఇంగ్లాండ్కు పరుగులు లభించడంతో మ్యాచ్ ఫలితమే మారిపోయిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా జులై 14న జరిగిన ఈ మ్యాచ్లో ఓవర్ త్రో కారణంగా ఇంగ్లాండ్కు 6 పరుగులు వచ్చాయి. ఫలితంగా ఇరు జట్ల ప్రధాన స్కోర్లు సమం అయ్యాయి.
దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ను నిర్వహించారు. సూపర్ ఓవర్లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఆతిథ్య జట్టైన ఇంగ్లాండ్ను ఐసీసీ విజేతగా ప్రకటించింది. అయితే, ఇలా బౌండరీ రూల్ ద్వారా విజేతను ప్రకటించడంపై అటు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం మండిపడ్డారు.
ఈ మ్యాచ్ ఫలితం మారిపోవడానికి కారణమైన ఓవర్ త్రో నిబంధనలపై క్రికెట్ విశ్లేషకులు నిప్పులు చెరిగారు. ఓవర్ త్రో నిబంధనలను మార్చాలని సూచించారు. ఈ నేపథ్యంలో క్రికెట్ చట్టాలను రూపొందించే మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) ఓవర్త్రో నిబంధనల్లో సవరణలు చేసే దిశగా ఓ నిర్ణయం తీసుకుంది.

ఎంసీసీ ప్రకటన
ఈ మేరకు ఎంసీసీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో "ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో చోటు చేసుకున్న ఓవర్ త్రో నిబంధనకు సంబంధించి 19.8 చట్టంపై వరల్డ్ క్రికెట్ కమిటీ(డబ్ల్యుసిసి) చర్చించింది. చట్టం స్పష్టంగా ఉందని భావించిన డబ్ల్యుసిసి ఈ విషయంపై సెప్టెంబర్ 2019లో లా సబ్ కమిటీ సమీక్షిస్తుంది" అని పేర్కొంది.

లార్డ్స్లో సమావేశమైన డబ్ల్యుసిసి
డబ్ల్యూసీసీ ప్యానల్లో ఉన్న మాజీ క్రికెటర్లు షేన్ వార్న్, కుమార సంగక్కరలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైక్ గాటింగ్ నేతృత్వంలోని వరల్డ్ క్రికెట్ కమిటీ(డబ్ల్యుసిసి) ఆది, సోమవారాల్లో లార్డ్స్లో సమావేశమైంది. ఈ సమావేశానికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌవర్ గంగూలీ సైతం హాజరు కావాల్సి ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఈ సమావేశానికి గంగూలీ హాజరు కాలేదు.

అసలేం జరిగింది?
ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో అనూహ్యంగా బెన్స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తీసిన రెండు పరుగులతోపాటు ఓవర్ త్రో వల్ల అదనంగా మరో నాలుగు పరుగులు ఆ జట్టుకు కలిసివచ్చాయి.

ఓవర్ త్రో కారణంగా
ఈ ఓవర్ త్రో కారణంగా మ్యాచ్ ఫలితమే తారుమారైంది. ఈ పరుగుల కారణంగా తొలుత ఇరు జట్లు ప్రధాన స్కోరు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ను నిర్వహించారు. సూపర్ ఓవర్లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఆతిథ్య జట్టైన ఇంగ్లాండ్ను ఐసీసీ విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్కు ఆరు పరుగులు
అయితే ఈ ఓవర్ త్రో విషయంలో అంపైర్లు ఇంగ్లాండ్కు ఆరు పరుగులు కేటాయిచడం వివాదాస్పదమైంది. నిబంధనల ప్రకారం ఐదు పరుగులివ్వాల్సి ఉండగా అంపైర్లు ఆరు పరుగులిచ్చారని మాజీ అంపైర్ సైమన్ టోఫెల్ విమర్శించాడు. సైమన్ టోఫెల్ మాట్లాడుతూ "నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్మెన్ పిచ్పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి" అని ఆయన అన్నారు.

బౌండరీతో పాటు సింగిల్నే
"వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్ స్ట్రయికింగ్ తీసుకోవాల్సి వచ్చేది. అయితే తాను అంపైర్ను విమర్శించడం లేదని, అదంతా ఆ సమయంలో మైదానంలో ఉండే ఉద్వేగాలు, వేడిలో అలాంటిది జరిగిపోయింది" అని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఓవర్త్రో నిబంధనలపై ఎంసీసీ సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని భావించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications