సెమీస్ పక్కా:
చమిందా వాస్ మాట్లాడుతూ... 'గత రెండు మూడేళ్లుగా భారత క్రికెట్ ఆధిపత్యం నడుస్తోంది. వారికి మంచి బ్యాకప్ బౌలర్లు ఉన్నారు. వారు అద్భుతాలు చేస్తున్నారు. ప్రపంచకప్నకు ఎంపిక చేసిన టీమిండియా జట్టు మంచి సమతూకంతో ఉంది. బాగా రాణించగలరు. ప్రపంచకప్లో టీమిండియా సెమీస్ చేరడం పక్కా అని అంచనా వేస్తున్నా' అని వాస్ తెలిపారు.
మలింగ అత్యంత కీలకం:
'గత కొన్ని నెలలుగా లంక జట్టు ప్రదర్శన ఏమీ బాగాలేదు. అయితే ప్రపంచకప్కు సెలెక్టర్లు సరైన జట్టును ఎంపికచేశారు. జట్టుగా రాణించగలరు. ప్రపంచకప్లో మలింగ అత్యంత కీలకం. బౌలర్గా అతడిపై మేము ఆధారపడడం కాయం. అతడి నాయకత్వం కూడా జట్టుకు ఉపయోగపడుతుంది. రోజుల వ్యవధిలో ముంబయి ఇండియన్స్కు, లంకలో దేశవాళీ క్రికెట్ ఆడటం అతడి అంకితభావాన్ని తెలియజేస్తోంది. లంక జట్టులో మలింగనే కీలక ఆటగాడు' అని వాస్ చెప్పుకొచ్చారు.
స్పిన్ విభాగం బాగుంది:
రంగనా హెరాత్ మాట్లాడుతూ... 'టీమిండియా స్పిన్ విభాగం బాగుంది. ముఖ్యంగా యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. సెలక్టర్లు కుడిచేతి వాటం లెగ్ స్పిన్నర్, చైనామన్ బౌలర్, మరో (జడేజా) స్పిన్నర్ను ఎంపిక చేశారు. ప్రపంచకప్లో వీరంతా రాణిస్తారు. అదనపు పరుగులు ఇవ్వొచ్చు కానీ వికెట్లు మాత్రం తీస్తారు. ఇంగ్లాండ్ పిచ్లు టోర్నీ మధ్యలో పొడిగా మారి స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. అప్పుడు స్పిన్నర్లలకు మంచి అవకాశం లభిస్తుంది. శ్రీలంక జట్టు కొత్తగా ఉంది.. కొత్త కెప్టెన్ వచ్చాడు. అతడి సారథ్యంలో లంక విజయాలు సాధిస్తుంది' అని హెరాత్ ఆశాభావం వ్యక్తం చేసాడు.