
హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2015 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా భారత్తో మ్యాచ్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడాలని తనను బుకీలు సంప్రదించినట్లు అక్మల్ వెల్లడించాడు. ''2015 వరల్డ్ కప్లో భారత్తో అదే మా తొలి మ్యాచ్. ఈ సందర్భంగా నేను వరుసగా రెండు బంతులు ఆడకుండా వదిలేస్తే బుకీలు దాదాపు రూ.1.3 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు" అని అక్మల్ అన్నాడు.
"అంతకు ముందు కూడా అలాంటి భారీ ఆఫర్లు పెద్ద ఎత్తున వచ్చాయి, కానీ వాటిని తిరస్కరించా. వాటికి నేను విరుద్ధమని, మరోసారి ఇలాంటి ఉద్దేశాలతో నా దగ్గరకు రావద్దని వాళ్లకు గట్టిగా చెప్పా'' అని అక్మల్ చెప్పాడు. ఈ సంచలన ఆరోపణలపై ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు వివరణ ఇవ్వాలంటూ అక్మల్కు సమన్లు జారీ చేశాయి.
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ వన్డే వరల్డ్ కప్లో 2015 ఫిబ్రవరి 15న జరిగిన భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో దిగిన పాక్ మహమ్మద్ షమీ బౌలింగ్ ధాటికి 224 పరుగులకు కుప్పకూలింది.
దీంతో భారత్ 76 పరుగులతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (107) సెంచరీ చెలరేగడంతో భారత్ విజయం సాధించింది.