సిల్లేట్: మహిళల ఆసియాకప్ 2022 టోర్నీలో భారత జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాలతో పూర్తి ఆధిపత్యం చెలాయించిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టుకు పాకిస్థాన్ ఊహించని షాకిచ్చింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ మహిళలు 13 పరుగులతో భారత్ను ఓడించారు. గత మ్యాచ్లో తమ కంటే బలహీనమైన థాయ్లాండ్ చేతిలో ఓడిన పాక్ మహిళలు.. పటిష్టమైన భారత్ను ఓడించి నేలకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ అయ్యారు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. పాక్ జట్టులో నిదా దార్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ బిస్మా మరూఫ్(35 బంతుల్లో 2 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ(3/27) మూడు వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్(2/23) రెండు వికెట్లు పడగొట్టింది. రేణుక సింగ్(1/24) ఓ వికెట్ తీసింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ అమ్మాయిలు 19.4 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటయ్యారు. వికెట్ కీపర్ రిచా ఘోష్(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 26), దయాలన్ హేమలత(22 బంతుల్లో 3 ఫోర్లతో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(17)తో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(12), తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన(15) దారుణంగా విఫలమయ్యారు.
ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన జెమీమా రోడ్రిగ్స్(2) కూడా తీవ్రంగా నిరాశపరిచింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు మూడు వికెట్లు తీయగా.. నిదార్ దార్, సదియా ఇక్బాల్ రెండే వికెట్లు తీసారు. ఐమన్ అన్వర్, టుబా హస్సన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నీలో మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడిన భారత అమ్మాయిలు మూడు విజయాలతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. పాక్ సైతం మూడు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. లీగ్ దశ ముగిసిన తర్వాత టాప్-4లో నిలిచిన జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. వీటిలో గెలిచిన జట్ల మధ్య ఫైనల్ జరగనుంది.